తెలంగాణలో మద్యం ప్రియులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల బీర్ల ధరలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వైన్స్ బంద్ ఉండనుంది. మద్యం దుకాణాలు మూతపడనున్న కారణంగా మందుబాబులు ముందుగానే సీసాలు నిల్వ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల సమయాల్లో గందరగోళ పరిస్థితులు రాకుండా ఉండేందుకు మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఎన్నికల సందర్భంగా మద్యం వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నందున, అది ఓటర్లపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నారు.
మూడు రోజులపాటు వైన్స్ మూసివేయడం మందుబాబులకు షాక్
ఇటీవల బీర్ల ధరలు పెరగడం, ఇప్పుడు మూడు రోజులపాటు వైన్స్ మూసివేయడం మందుబాబులకు రెండు మార్లు షాక్ ఇచ్చినట్లైంది. ఎన్నికల సందర్భంగా తరచుగా మద్యం నిషేధాన్ని అమలు చేయడం సహజమే అయినప్పటికీ, అకస్మాత్తుగా వచ్చిన ఈ నిర్ణయం పలువురికి అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే, అధికార వర్గాలు ప్రజలను అస్వస్థతకు గురిచేయకుండా ఎన్నికల సమయంలో నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశాయి.