మిర్చి రైతులను ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం తన పర్యటనపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ధరల్లేక, పంటను కొనేవారు లేక మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ పేర్కొన్నారు. గుంటూరు మార్కెట్ యార్డులో రైతులను పరామర్శించాననీ, పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చియార్డు ప్రాంతం కిక్కిరిసిపోయిందని ట్వీట్ చేశారు. ఈ కారణంగా ప్రజలనుద్దేశించి పూర్తిగా మాట్లాడలేకపోయానంటూ వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు.
మిర్చిరైతుల కష్టాలు
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయని వైఎస్ జగన్ విమర్శించారు. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరని ఆరోపించారు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు, ఇవాళ మిర్చిరైతుల కష్టాలు చూస్తున్నామన్నారు. చంద్రబాబు సీట్లోకి వచ్చి రైతులను మళ్లీ పట్టి పీడిస్తున్నారని విమర్శించారు.

వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదు: జగన్
తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయనీ, ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదని వెల్లడించారు. పెట్టుబడి ఖర్చులు ఎకరాకు లక్షన్నర పైమాటే అవుతోందని.. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆరోపించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులందరి పరిస్థితి ఇలా ఉందన్న వైఎస్ జగన్.. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఒక్క సమీక్ష జరపలేదని… ప్రభుత్వం తరుఫున రైతులను పలకరించేవారు కూడా లేరంటూ ఆరోపించారు,
కనీస మద్దతు ధర లేదు
సచివాలయానికి అత్యంత సమీపంలోనే గుంటూరు మార్కెట్ యార్డు ఉందని.. అయినా కూడా ఇక్కడి రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబునాయుడుకి వినిపించడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సహాయం చేయకపోగా.. వైసీపీ హయాంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ కూడా మూలన పడేశారని ఆరోపించారు. ఆర్బీకేలు, ఈ- క్రాప్ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ ల్యాబులు, రైతులకు పెట్టుబడి సహాయం, సున్నావడ్డీకే రుణాలు, పంటలకు కనీస మద్దతు ధర ఇలాంటివన్నీ పక్కనబెట్టారని జగన్ ఆరోపించారు.
పలావూ లేదు, బిర్యానీ లేదు కానీ..
ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అన్నారనీ.. రైతులకు కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ కాకుండా, రూ.20వేలు ఇస్తామని నమ్మబలికారని జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారని మండిపడ్డారు. పలావూ లేదు, బిర్యానీ లేదు కానీ.. వైసీపీ హయాంలో ఇచ్చిన రైతు భరోసా కొనసాగించకుండా రద్దు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి, రైతే రాజని గుర్తించాలని జగన్ సూచించారు.