हिन्दी | Epaper

సంక్రాంతి నుంచి తెలంగాణ రైతుభరోసా పథకం..?

Sudheer
సంక్రాంతి నుంచి తెలంగాణ రైతుభరోసా పథకం..?

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ పథకం కేవలం సాగు చేసే భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతు భరోసా అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్రాంతి నుండి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను పూర్తి చేస్తున్నామన్నారు. ఈ పథకం అమలులో కచ్చితత్వాన్ని పెంచడానికి ఉపగ్రహ డేటాను వినియోగిస్తామన్నారు. గ్రామాల్లోని సర్వే నెంబర్ల ఆధారంగా సాగు వివరాలను సేకరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.

రైతు భరోసా పథకం కింద నిష్పక్షపాతంగా వ్యవసాయాధికారులు సాగు చేస్తున్న రైతుల పేర్లను నమోదు చేస్తున్నారని మంత్రి తెలిపారు. రిమోట్ సెన్సింగ్ డేటాను ఉపయోగించి సాగు విస్తీర్ణాన్ని గుర్తించే విధానాన్ని అమలు చేయబోతున్నామని వివరించారు. ఈ విధానం పథకంలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

ఇందులో భాగంగా సాగు విస్తీర్ణాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలిగే సంస్థలతో మంత్రి చర్చలు జరిపారు. సాగు వివరాలను సేకరించడంలో మరియు పథక అమలులో ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూడటమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. పథకం ద్వారా రైతులకు గరిష్ట సాయం అందించడమే తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు వ్యవసాయరంగంలో సాంకేతికత వినియోగానికి మంచి ఉదాహరణగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. సంక్రాంతి నాటికి ఈ పథకం ప్రారంభం రైతులకు భారీ స్థాయిలో లబ్ధి చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870