పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బంగారు గని కుప్పకూలిన ఘటనలో 42 మంది అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. కెనైబా జిల్లాలోని దబియా ప్రాంతంలో ఉన్న బిలాలీకొటోలో ఈ ఘటన జరిగింది. చైనా దేశస్తుల ఆధీనంలో ఉన్న ఓ బంగారు గనిలో మట్టిచరియలు విరిగి పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే మాలిలో ఇలా ప్రమాదం జరగడం రెండోసారి కావడం గమనార్హం. జనవరి 29వ తేదీన ఓ బొగ్గు గనిలో మట్టిపెళ్లలు విరిగిపడి అనేక మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
మరణాల పెరిగే అవకాశం
ఈ ఘటనలో ఒక్కసారిగా గనిలో చాలాభాగం కుప్పకూలి పోయింది. అయితే 42 మంది అక్కడిక్కడే మృతి చెందగా ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అనేక మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బంగారం వెలికితీసేందుకు వెళ్లిన వందల మంది కార్మికులు ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన రెస్క్యూ సిబ్బంది.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రెండో అతి పెద్ద ప్రమాదం
మరోవైపు.. ప్రమాదం చోటుచేసుకున్న గనికి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. అయితే నెల రోజుల వ్యవధిలో ఆఫ్రికాలో చోటు చేసుకున్న రెండో అతి పెద్ద ప్రమాదం ఇదే కావడం గమనార్హం. గత నెలలో కోలికోరో ప్రాంతంలో బంగారు గని కూలీ 70 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరోవైపు.. జనవరిలోనూ మాలిలోని బంగారు గనిలో ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించారు. ఇందులో మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. అయితే మాలీ జనాభాలో 10 శాతం కంటే ఎక్కువమంది బంగారం మైనింగ్ పైనే ఆధార పడి జీవనం సాగిస్తూ ఉంటారు.