ఆంధ్రప్రదేశ్లోని రైతులు, మత్స్యకారులు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మత్స్యకారులకు మత్స్యకార భరోసా, రైతులకు అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.

ఏప్రిల్ నుంచి మత్స్యకార భరోసా:
ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేయనుంది. సముద్రంలో చేపల వేట నిషేధిత కాలంలో జీవన భృతి కోసం ఈ సాయం చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఏప్రిల్ నెల నుంచే ఈ సహాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
మే నెలలో అన్నదాత సుఖీభవ:
రైతుల కోసం ప్రభుత్వం మే నెలలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000 అందజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం, ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
జూన్లో తల్లికి వందనం:
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఈ పథకం కింద స్కూలు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్:
ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మరోవైపు వచ్చే ఐదేళ్లలో ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వం ప్రాధాన్యమని అదే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీపై సంతకం చేశారని గుర్తుచేశారు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున నోటిఫికేషన్ విడుదల చేయలేకపోయామని తెలిపారు. కోడ్ ముగిసిన వెంటనే 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాలు:
మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటనలు ఏపీ ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. రైతులు, మత్స్యకారులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత అందరికీ ఈ పథకాలు ప్రయోజనం కలిగించేలా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మొత్తం మీద ఏప్రిల్ నుంచి మత్స్యకార భరోసా కింద రూ.20,000 మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం జూన్లో తల్లికి వందనం అమలు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ఈ పథకాలు రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కొత్త మార్గాన్ని చూపేలా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.