తరచుగా పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవిస్తున్నా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నది. దీనితో అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సత్తూర్ సమీపంలోని పటాకుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పటాకుల పేలుడు ధాటికి కార్మికులు కొన్ని మీటర్ల దూరం ఎగరిపడ్డారు. సమీపంలోని ఆరు ఇండ్లు ధ్వంసమయ్యాయి.

పోలీసులు సహాయక చర్యలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశామన్నారు.
కాగా, గతేడాది అక్టోబర్లో కూడా తిరువూరు జిల్లాలోని ఓ పటాకుల గోడౌన్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వారిలో 9 నెలల చిన్నారి కూడా ఉన్నది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి 10 ఇండ్లకుపైగా ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దానికి ప్రజలు భయంతో పరుగులు తీశారు.