తెలంగాణలో పర్యావరణహిత రవాణాకు ప్రాధాన్యత ఇస్తూ, త్వరలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ముందంజ లో ఉందని, ఈవీల అమ్మకాల్లో అగ్రస్థానాన్ని సాధించిందని ఆయన వెల్లడించారు. ప్రజాసౌకర్యాన్ని పెంపొందించడంతో పాటు, పరిమాణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల రాజధాని
హైదరాబాద్ను ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా మారుస్తామని సీఎం స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) నుంచి ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్) వరకు మెరుగైన కనెక్టివిటీతో మాన్యుఫాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు ఆహ్వానం
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం విస్తృత కార్యాచరణ సిద్ధం చేసిందని వెల్లడించారు. ఈవీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ, ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్లు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణ, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు, ప్రజలకు అధునాతన రవాణా సేవలను అందించేలా మారుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.