పుష్ప-2 రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, మరో బాలుడు గాయపడి చికిత్స తీసుకుంటున్న ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఒకవైపు కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రస్తావించడాన్ని కొందరు తప్పుపడుతుంటే.. మధ్యంతర బెయిల్పై ఉన్న వ్యక్తి ఈ కేసు విషయమై మీడియా సమావేశం నిర్వహించడాన్ని మరికొందరు తప్పుపడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం పోలీసులు హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీల మధ్య వార్
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్రమేపి రాజకీయరంగు పులుముకుంది. కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షాలుగా ఈ ఘటన మారిపోయింది. కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ వ్యవహారాన్ని తప్పుపడుతుండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తొక్కిసలాటలో మహిళ చనిపోవడం దురదృష్టకరమంటూనే అల్లు అర్జున్ను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని విమర్శిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నడుస్తున్నారని, బీఆర్ఎస్ అల్లు అర్జున్కు ఎందుకు మద్దతు ప్రకటిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
బెయిల్ రద్దవుతుందా?
అల్లు అర్జున్ కేసులో సాక్షులు, పిటిషనర్ను ప్రభావితం చేయగల వ్యక్తి అని, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో కేసు విచారణ పూర్తయ్యేవరకు బెయిల్ ఇవ్వొద్దని, మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మధ్యంతర బెయిల్పై ఉన్నప్పుడు కేసు గురించి మీడియా ముందు మాట్లాడకూడదనే షరతులు ఉన్నప్పటికీ.. కోర్టు షరతులను అల్లు అర్జున్ ఉల్లంఘించారనే వాదనను ప్రభుత్వం తరపున న్యాయవాదులు వినిపించే అవకాశం లేకపోలేదు. దీంతో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దవుతుందా.. లేదంటే కోర్టు బెయిల్ను పోడిగిస్తుందా అనేది వేచి చూడాలి.
