Sharmila: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదం కాదని.. సంఘటన స్థలంలో ఇది హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయని చెప్పారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయన్నారు.

వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలి
ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాల మృతి పై వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నిజాలు నిగ్గు తేల్చాలి. ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
పగడాల శరీరంపై గాయాలు
కాగా, క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ.. ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.