YS Jagan: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రామగిరి మండలం, పాపిరెడ్డి పల్లిలో ఇటీవల హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. బెంగళూరులో ఉన్న ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో రాప్తాడుకు రానున్నారు. లింగమయ్య హత్య తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల మధ్య వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటన
మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్రెడ్డిని పాపిరెడ్డిపల్లికి రానివ్వకుండా అడ్డుకునే దమ్ము, ధైర్యం రెండూ మాకున్నాయి అని అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. వైసీపీ అధినేత జగన్ మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనకు రావడంపై స్పందించారు. మాలో ఉన్నది చంద్రబాబు, టీడీపీ రక్తం. రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పర్యటనపై మా పార్టీ నాయకులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పరిటాల రవి పులివెందులకు వెళ్లినప్పుడు జగన్ కుటుంబం అడ్డుకుంది. అందుకే జగన్రెడ్డిని అడ్డుకోవాలనే అభిప్రాయం మా పార్టీ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది.
ఏదైనా సాయం చేసిపోవాలి.. ప్రజల మధ్య చిచ్చుపెట్టవద్దు
అయితే మా నాయకుడు చంద్రబాబు అలాంటి సంస్కృతిని మాకు నేర్పలేదు. ఒక చావును రాజకీయం చేసేందుకు జగన్రెడ్డి వస్తున్నారు. అనుకోకుండా జరిగిన సంఘటనను ఫ్యాక్షన్ హత్యగా చిత్రీకరించి, తోపుదుర్తి సోదరులు రాజకీయం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఒక మాజీ సీఎం ఇక్కడకు రావడం సరైంది కాదు. జగన్ వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఏదైనా సాయం చేసిపోవాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇక్కడ ప్రజల మధ్య చిచ్చుపెట్టవద్దు. బీసీల మీద జగన్కు అంత ప్రేమే ఉంటే రాప్తాడు ఇన్చార్జిగా ఒక బీసీని నియమించాలి అన్నారు.
Read Also: ఏపీలో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం