Aarogyasri Services : ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్య శ్రీ సేవలు) నేటి నుంచి యథాతథంగా కొనసాగనున్నాయి. బకాయిలు రూ. 500 కోట్ల తక్షణం విడుదలకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె విరమించాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు మంగళవారం నుంచి ఏ ఆటంకం లేకుండా కొనసాగుతాయని పేద ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆశా కార్యవర్గం సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆషా టీం ప్రకటించింది.

సీఎంతో ఫలించిన చర్చలు
ఎన్టీఆర్ వైద్య సేవ కింద క్యాష్లెస్ సేవలు పునఃప్రారంభం అవుతాయని, ఆపత్కాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు ఫలించాయని ఆషా టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. బిల్లులు వేల కోట్లు బకాయి ఉండటంతో నెట్ వర్క్ హాస్పిటల్స్ ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడం కుదరంటూ మెడికల్ సర్వీసెస్ నిలిపివేశాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అత్యవసర పరిస్థితిగా గుర్తించారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలోనూ సోమవారం నాడు ఆశా కార్యవర్గంతో చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు.
500 కోట్లు విడుదలకు చంద్రబాబు ఆమోదం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని, అయినా పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రుల పాత్రను గౌరవిస్తూ, ఎన్టీఆర్ వైద్య సేవ కింద పెండింగ్ బకాయిలు చెల్లింపులలో భాగంగా వెంటనే రూ. 500 కోట్లు విడుదల చేయడానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. మిగిలిన పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, త్వరలోనే మరో సమావేశాన్ని నిర్వహించి ఎన్టీఆర్ వైద్యసేవలపై ఇతర అంశాలపై చర్చిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆషా సంఘం తెలిపింది.
Read Also : బనకచర్ల ప్రాజెక్ట్ వివరాలను దాస్తున్న ఏపీ!