ఇటీవల టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.తక్కువ పనితీరు చూపుతున్న ఉద్యోగులకు “ఒకే ఒక్క అవకాశం – ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకోండి” అంటూ హెచ్చరించింది.ఈ విషయంపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.మైక్రోసాఫ్ట్ ఇటీవల “గ్లోబల్ వాలంటరీ సెపరేషన్ అగ్రిమెంట్ (GVSA)” అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.దీని ద్వారా తక్కువ పనితీరు చూపుతున్న ఉద్యోగులకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. మొదటిది – పనితీరు మెరుగుదల ప్రణాళిక (PIP).రెండవది – స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీ.PIP ఎంచుకుంటే – ఉద్యోగి కఠినమైన లక్ష్యాలను చేరుకోవాలి. కానీ, దీనిలో వేతన ప్యాకేజీ ఉండదు.విడివిడిగా వెళ్లాలంటే – 16 వారాల వేతనంతో కూడిన ప్యాకేజీ లభిస్తుంది. అయితే, రాబోయే రెండేళ్లలో మైక్రోసాఫ్ట్లో తిరిగి చేరే అవకాశం ఉండదు.అయితే, ఉద్యోగికి ఈ రెండు ఎంపికల్లో ఏదైనా తీసుకోవడానికి కేవలం ఐదు రోజులే మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ ఏప్రిల్ 22న మేనేజర్లకు మెయిల్ పంపారు.

పనితీరు ఆధారంగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం కీలకం అని అందులో పేర్కొన్నారు.సంపూర్ణ పారదర్శకతతో, వేగవంతమైన నిర్ణయాల వల్ల సంస్థలో వృద్ధి సంస్కృతి ఏర్పడుతుంది అని ఆమె స్పష్టం చేశారు.PIPలో ఉంటే, ఉద్యోగికి ఇంకెలాంటి వేతన ప్యాకేజీ లభించదు.వాలంటరీ ఎగ్జిట్ తీసుకుంటే, రెండు సంవత్సరాలు మైక్రోసాఫ్ట్లో తిరిగి దరఖాస్తు చేయలేరు.అంతర్గత బదిలీలకు అర్హత లేకపోవచ్చు.ఐదు రోజుల డెడ్లైన్ వల్ల ఉద్యోగులపై భయంతో కూడిన ఒత్తిడి పెరిగింది. ప్యాకేజీ తీసుకుంటే భవిష్యత్తు అవకాశాలు కోల్పోతారనే భయం… లేదా PIPలో పడితే ఉద్యోగ భద్రత ఉంటుందా అనే సందేహం… వారిని గందరగోళానికి గురిచేస్తోంది.ఈ విధానం ద్వారా మైక్రోసాఫ్ట్ తమ వర్క్ఫోర్స్ను నెమ్మదిగా తగ్గిస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పనితీరు మెరుగుపరచే పేరుతో ఉద్యోగులను నెమ్మదిగా బయటకు పంపించే ప్రయత్నమే ఇదని పరిశీలకులు అంటున్నారు.మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ కొత్త విధానం ఉద్యోగుల పని పద్ధతుల్లో మార్పులు తేవడానికే సరిపడుతుందా? లేక ఉద్యోగుల భద్రతకు ఇది ముప్పుగా మారుతుందా? అన్నదే ఇప్పుడు టెక్ ప్రపంచంలో వేడెక్కిన చర్చగా మారింది.
Read Also : Summer Holidays: తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు నేటి నుండి వేసవి సెలవులు