ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. గతంలో ప్రారంభమైనా, ఆగిపోయిన అమరావతి రాజధాని నిర్మాణ పనులకు మళ్లీ ప్రాణం పోసేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మే 2న జరగనున్న అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా ఆహ్వానించేందుకు ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు.
అధికారిక ఆహ్వానం
ప్రధాని మోదీతో సమావేశం అనంతరం, ఈ కార్యక్రమానికి ఆయన హాజరుకావాల్సిందిగా అధికారిక ఆహ్వానం అందించనున్నారు. అమరావతి నిర్మాణాన్ని రాష్ట్ర అభివృద్ధి ప్రతీకగా మార్చేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు. దీంతో కేంద్రం సహకారాన్ని మరింతగా పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజధాని పనులను తిరిగి ప్రారంభించడమొక నూతన అధ్యాయంగా భావిస్తున్న సీఎం, కేంద్రంతో మైత్రిని బలోపేతం చేయాలని యోచిస్తున్నారు.
సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం
ఈ రోజు సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమై రాత్రి 9 గంటల సమయంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అమరావతిపై చంద్రబాబులో ఉన్న స్పష్టత, పట్టుదల ఈ పునఃప్రారంభ కార్యక్రమాన్ని కేంద్రంలో కూడా ప్రముఖ అంశంగా మార్చనున్నాయి. రాష్ట్ర ప్రజల ఆశల బీజం అమరావతి మళ్లీ చిగురించబోతున్న సంకేతాలు ఇప్పటి నుంచే కనిపిస్తున్నాయి.