టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలకు రంగం సిద్ధం.. మందుబాబులకు తక్కువ ధరలో మద్యం అందుబాటులోకి
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్సైజ్ శాఖ వసూళ్ల పరంగా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సాధిస్తోంది. ప్రభుత్వ ఖజానా నింపడంలో కీలక పాత్ర పోషిస్తున్న మద్యం అమ్మకాల్లో తాజాగా మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. తక్కువ ధరలకే మద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ కొత్త ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలతో మందుబాబులకు గుడ్న్యూస్ చెప్పినట్లే. సీసా రూపంలో లభిస్తున్న మద్యం ఇకపై టెట్రా ప్యాకెట్ల్లో సులభంగా లభించబోతోంది. కర్ణాటకలో విజయవంతంగా అమలు చేస్తున్న మోడల్ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముందుకు వెళ్తోంది. ఫలితంగా, మందు ధరలు రూ.10 నుంచి రూ.15 వరకు తగ్గే అవకాశముంది.
జేబులో పెట్టుకుని తాగే మద్యం… ఇక ప్యాకెట్లలోనే!
ఇప్పటికే ఎక్సైజ్ శాఖ తయారు చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశారు. ఆమోదం లభించిన వెంటనే టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మకాలు ప్రారంభమవుతాయి. వీటి పరిమాణాలు 60 ఎంఎల్, 90 ఎంఎల్, 180 ఎంఎల్లుగా ఉండనున్నాయి. ఫ్రూట్ జ్యూస్లా వీటిని జేబులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ కొత్త విధానంతో మద్యం కొనుగోలు మరింత సులభతరమవుతుంది. ఇప్పటివరకు క్వార్టర్ చీఫ్ లిక్కర్ ధర రూ.120 ఉండగా, అదే మద్యం టెట్రా ప్యాకెట్ రూపంలో రూ.100 నుంచి రూ.105 మధ్య లభించబోతుంది. ఈ విధానం వల్ల వినియోగదారుడికి మద్యం తక్కువ ధరకే అందుతుంది. అలాగే ప్రభుత్వానికి ఆదాయం పెరగడం ద్వారా పరస్పర లాభాలు పొందగలుగుతారు.
55 కంపెనీలతో జాయింట్ ఆపరేషన్ – అమ్మకాల్లో విప్లవాత్మక మార్పు
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 2620 వైన్ షాపులు, 1117 బార్లు టెట్రా ప్యాకెట్లను విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. దేశవిదేశాలకు చెందిన 55కు పైగా కంపెనీలు ఈ ప్రక్రియలో భాగస్వాములవుతాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మెక్డొవెల్స్ నంబర్ వన్ వంటి ప్రముఖ కంపెనీలు టెట్రా ప్యాకెట్ బిజినెస్ కోసం ముందుకొచ్చాయి. కర్ణాటకలో మెక్డొవెల్స్ 90 శాతం అమ్మకాలు టెట్రా ప్యాకెట్ల రూపంలోనే జరుపుతోందట. అదే విధానాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. క్వార్టర్ బాటిల్ అమ్మకాలు తగ్గిపోతుండటంతో కొత్త ప్యాకింగ్ విధానం ద్వారా అమ్మకాలు మరింత పెంచుకోవచ్చన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పైలెట్ ప్రాజెక్టుగా ఒక జిల్లాలో ప్రారంభం
ఇప్పటివరకు తమిళనాడు, బీహార్లో టెట్రా ప్యాకెట్ల పథకం తీసుకురావాలన్న యత్నాలు నిరసనలతో నిలిచిపోయాయి. అయితే, ఈసారి ఎక్సైజ్ శాఖ ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా ఒక జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించింది. అక్కడ ఫలితాలు ఆశించిన విధంగా ఉంటే.. పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ పథకం వల్ల వినియోగదారుడు తక్కువ ధరకు మద్యం పొందే అవకాశం కలుగుతుంది. కంపెనీలకు తయారీ ఖర్చులు తగ్గుతాయి. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఇదే కాకుండా, అక్రమ మద్యం అమ్మకాలకు చెక్ పెట్టేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది.
READ ALSO: AP Liquor: ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం