టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ గాయపడిన వార్త క్రికెట్ ప్రేమికులను షాక్కు గురిచేస్తోంది. తన కొడుకు అన్వయ్తో కలిసి క్రికెట్ ఆడుతుండగా, గాయం కావడంతో ఆటను మధ్యలోనే విరమించుకోవాల్సి వచ్చింది. కాలికి గాయమై డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన ద్రవిడ్కు చికిత్స అందించగా, ప్రస్తుతం ఆయన చేతికర్రల సహాయంతో నెమ్మదిగా నడుస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దీంతో అభిమానులు ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విజయ క్లబ్ తరఫున
బెంగళూరులోని విజయ క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతున్న సమయంలో చోటుచేసుకుంది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్ సిఏ) గ్రూప్-3 సెమీఫైనల్ మ్యాచ్లో ద్రవిడ్ తన కొడుకు అన్వయ్తో కలిసి బ్యాటింగ్ చేశాడు. 28 బంతుల్లో 29 పరుగులు చేసిన ద్రవిడ్, వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న క్రమంలో నొప్పితో బాధపడ్డాడు. మొదట స్వల్ప నొప్పిగా అనిపించినా, తర్వాత తీవ్రత పెరగడంతో అతను డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు.
రాజస్థాన్ రాయల్స్ క్యాంప్
రాహుల్ ద్రవిడ్ త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. అయితే, ఇటీవల జైపూర్లో ప్రారంభమైన రాజస్థాన్ రాయల్స్ ప్రాక్టీస్ క్యాంప్లో ఆయన హాజరుకాలేదు. తాజాగా బుధవారం ద్రవిడ్ క్యాంప్కు చేరుకున్నప్పటికీ, కాలికి పెద్ద బ్యాండేజ్ ఉండటం, చేతికర్రల సాయంతో నెమ్మదిగా నడవడం చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.ద్రవిడ్ చేతికర్రలు ఉపయోగిస్తూ నడుస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, అభిమానులు “ద్రవిడ్ త్వరగా కోలుకోవాలి” అంటూ సందేశాలు పంపిస్తున్నారు.

ప్రభావం
రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే (ఐపీఎల్) 2025 సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీమ్ మేనేజ్మెంట్ ద్రవిడ్ గాయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ, అతను త్వరలో కోలుకుంటాడని చెబుతున్నారు.ద్రవిడ్ మానసిక స్థైర్యానికి పేరు పొందిన ఆటగాడు, తక్కువ సమయంలోనే గాయాన్ని అధిగమించి తిరిగి క్రీడా రంగంలో రాణిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.