తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. కొమురం భీమ్ జిల్లా సిర్పూర్, గిన్నెదారిలో 6.5°C తో రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అలాగే సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.9°C, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు కారణంగా ప్రజలకు ఉదయాన్నే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు వేకువ జామున ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణశాఖ ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శీతల గాలులు మరికొన్ని రోజులు కొనసాగుతాయని అంచనా. ముఖ్యంగా రాత్రి, వేకువ జామున గాలి చలిగా ఉండడంతో పలు ప్రాంతాల్లో తీవ్రత అధికంగా కనిపిస్తోంది. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వేడి దుస్తులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు రాత్రి సమయంలో బయటకు వెళ్లేందుకు వీలైనంతవరకు మానుకోవాలి.
రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు ఇదే తరహా చలి కొనసాగవచ్చని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని వారు పేర్కొన్నారు. ప్రజలు శీతాకాలం తీవ్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.