తెలంగాణ రాష్ట్రానికి తీరప్రాంతం లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు మచిలీపట్నం పోర్టును ప్రత్యేక రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో నిర్మించనున్న డ్రైపోర్టును వేర్హౌస్ హబ్గా తీర్చిదిద్దడం ద్వారా మచిలీపట్నం పోర్టుతో అనుసంధానమవుతుందని తెలిపారు. దావోస్లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ఈ ప్రకటన చేశారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వేగవంతమైన మరియు పర్యావరణ అనుకూల నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు పరిశ్రమలు, సంస్థలు, ప్రజల మద్దతు కావాలని కోరారు. నాలుగు కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడమే తమ ముఖ్య దిశగా ఉందని పేర్కొన్నారు.
పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్ ట్యాక్స్ రద్దు చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు తెలంగాణలోనే జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపై సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. మెట్రో లైన్ విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని, కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో 100 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని సీఎం పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.