వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2025: లోక్సభలో హాట్ టాపిక్
కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు-2025ను ప్రవేశపెట్టింది. ఈ కీలకమైన బిల్లుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభలో చర్చకు అనుమతించారు. విపక్ష సభ్యుల అభ్యంతరాలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానాలు, స్పీకర్ రూలింగ్స్.. ఇలా ఈ చర్చ హాట్ టాపిక్గా మారింది.
విపక్ష అభ్యంతరాలు – కమిటీ అధికారాలపై ప్రశ్నలు
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి చెందిన ఎన్.కె. ప్రేమచందన్ ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవనెత్తుతూ, “ఇక్కడ ఒరిజినల్ బిల్లుపై చర్చ జరగడం లేదు” అని విమర్శించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కొత్త నిబంధనలను చేర్చే అధికారం ఉందా? అని ప్రశ్నించారు. రూల్ 81ని సస్పెండ్ చేయకపోతే లోక్సభ కూడా కొత్త నిబంధనలను చేర్చలేదని ఆయన వాదించారు.
అమిత్ షా కౌంటర్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుంటూ, “ప్రతిపక్షాల డిమాండ్ మేరకే బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాము” అని స్పష్టం చేశారు. కమిటీ తన అభిప్రాయాలను తెలియజేసిందని, క్యాబినెట్ వాటిని సమీక్షించి ఆమోదించిందని చెప్పారు. “కమిటీకి అభిప్రాయాలు చెప్పే అధికారం లేకపోతే దాని ఉనికి అర్థరహితం అవుతుంది” అని అమిత్ షా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో కమిటీలు రబ్బర్ స్టాంప్లా ఉండేవని, మోడీ హయాంలో మార్పులకు వీలుంది అని స్పష్టం చేశారు.
స్పీకర్ ఓం బిర్లా రూలింగ్స్
వక్ఫ్ సవరణ బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ‘పార్లమెంటు యొక్క ఆచరణ మరియు విధానం’ అనే ప్రామాణిక గ్రంథాన్ని ఉటంకించారు. “కమిటీకి విస్తృత అధికారాలు ఉంటాయి. అది బిల్లును సవరించడమే కాకుండా పునర్నిర్మించగలదు” అని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష ఆగ్రహం – కమిటీ సిఫార్సులపై తీవ్ర విమర్శలు
గత సంవత్సరం పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ప్రవేశపెట్టిన ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఫిబ్రవరి 13న కమిటీ నివేదికను సమర్పించగా, ఫిబ్రవరి 19న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే, తమ ప్రతిపాదిత సవరణలను తిరస్కరించారని, తమ అసమ్మతి గళాలను నివేదిక నుండి తొలగించారని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు.
బిల్లులో కీలక మార్పులు
చట్టానికి పేరు మార్చడం
ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించే అవకాశం
రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం రెండు ముస్లిమేతర సభ్యులను వక్ఫ్ బోర్డుకు నియమించవచ్చు
వివాదాస్పద ఆస్తి వక్ఫ్కు లేదా ప్రభుత్వానికి చెందిందా అనే నిర్ణయం జిల్లా కలెక్టర్ తీసుకోవచ్చు
“వక్ఫ్ బై యూజర్” అనే భావనను తొలగించడం
ఆరు నెలల్లోపు ప్రతి వక్ఫ్ ఆస్తిని కేంద్ర డేటాబేస్లో నమోదు చేయడం
ట్రిబ్యునల్ నిర్ణయం అంతిమం అనే నిబంధనను తొలగించడం
వక్ఫ్ చట్టానికి ఉన్న నేపథ్యం
వక్ఫ్ అంటే దాతృత్వం అని అర్థం. ఇది ముస్లింలు మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం విరాళంగా ఇచ్చే ఆస్తి. ఒకసారి వక్ఫ్గా ప్రకటించిన తర్వాత, ఆ ఆస్తి దేవునికి చెందినదిగా పరిగణించబడుతుంది. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల పాలన 1995 నాటి వక్ఫ్ చట్టం ద్వారా నిర్వహించబడుతోంది.
భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల స్థితి
ప్రస్తుతం వక్ఫ్ బోర్డులు 9.4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న 8.7 లక్షల ఆస్తులను నియంత్రిస్తున్నాయి. వీటి విలువ రూ. 1.2 లక్షల కోట్లు అని అంచనా. ప్రపంచంలోనే భారతదేశంలోనే అతిపెద్ద వక్ఫ్ హోల్డింగ్ ఉంది. సాయుధ దళాలు, భారతీయ రైల్వేల తర్వాత వక్ఫ్ బోర్డులే దేశంలో అతిపెద్ద భూ యజమానులు.
చట్ట సవరణపై ముస్లిం సమాజం అభిప్రాయాలు
ఈ సవరణ బిల్లుపై ముస్లిం మతపెద్దలు, మతపరమైన సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం కల్పించడాన్ని ఇస్లామిక్ లా ఉల్లంఘనగా భావిస్తున్నారు.
బిల్లు ఆమోదం అవుతుందా?
ప్రస్తుతం బిల్లుపై ప్రతిపక్షాల భగ్గుమనే పరిస్థితి. రాజ్యసభలో దీనిపై తీవ్రంగా చర్చించనున్నారు. బిల్లు ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపుతుందా? అన్నదే ఆసక్తికరమైన విషయం.