లోక్సభ వక్ఫ్ సవరణ బిల్లును బుధవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓటు వేయగా, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షం చేసిన అన్ని సవరణలను వాయిస్ ఓటు ద్వారా తిరస్కరించారు.

ప్రతిపక్ష ఎంపీ ఎన్కే ప్రేమచందన్ చేసిన సవరణ ప్రతిపాదనలపై తెల్లవారు జామున 1:15 గంటలకు ఓటింగ్ నిర్వహించారు. అయితే, 288 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రతిపక్ష అభిప్రాయాలను తోసిపుచ్చారు. ప్రేమచందన్ తన ప్రతిపాదనలో వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. కానీ, సభలో అధికారం కలిగిన ప్రభుత్వ పక్షం ఈ ప్రతిపాదనను నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించింది. ఈ బిల్లుపై లోక్సభలో దాదాపు 12 గంటల పాటు చర్చ జరిగింది. బిల్లు గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
హోంమంత్రి అమిత్ షా, కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు
బుధవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కిరణ్ రిజిజు మాట్లాడుతూ – ఈ బిల్లులో ఏ మతంపై కూడా జోక్యం చేసుకునే ఉద్దేశం లేదు, కేవలం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత కోసం తీసుకువచ్చిన బిల్లు అని స్పష్టం చేశారు. గత చట్టంలో ఉన్న వివాదాస్పద సెక్షన్ 40ని ప్రస్తావిస్తూ, వక్ఫ్ బోర్డు ఏదైనా భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించగలదని, కానీ ట్రిబ్యునల్ మాత్రమే దాన్ని రద్దు చేయగలదని తెలిపారు. ముస్లిం సమాజానికి సంబంధించిన భూమిని ఎవరూ బలవంతంగా తీసుకోలేరని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ – ప్రస్తుత బిల్లు లాలూ యాదవ్ కోరినట్టుగానే ఉంటుందని అన్నారు. ప్రతిపక్షం వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించిందని ఆరోపించారు. సొంత దేశంలో మొఘల్ చట్టాలకు తాము ప్రాధాన్యం ఇవ్వబోము అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2013లో యూపీఏ-2 ప్రభుత్వం చేసిన సవరణ అరాచకానికి దారి తీసిందని, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా దీన్ని అన్యాయంగా అభివర్ణించారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును స్వేచ్ఛా హక్కులను హరించేలా ఉందని, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించాయి. అయితే, దీనిపై కిరణ్ రిజిజు మాట్లాడుతూ 1954 నుండి వక్ఫ్ చట్టం అమలులో ఉంది, అయితే ఇప్పుడు సవరణ రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. వక్ఫ్ చట్టం ప్రకారం, వక్ఫ్ ఆస్తులు ముస్లిం మతపరమైన సేవలు, మసీదులు, మదర్సాలు, సమాధులు, మదీనా యాత్ర సహా పలు ధార్మిక అవసరాలకు వినియోగించడానికి ఉద్దేశించిన భూములు, స్థిరాస్తులు. అయితే, గత కొంతకాలంగా ఈ ఆస్తులపై వివాదాలు చెలరేగాయి. ముస్లింలకు భారత్ మాత్రమే సురక్షితమైందన్నారు. వక్ఫ్లో ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు.