ఆందోళనలో పేద బ్రాహ్మణ విద్యార్థులు అప్పులపాలవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
హైదరాబాద్: వివేకానంద విదేశీ విద్యాపథకం కింద పలుదేశాల్లో చదువును అభ్యసిచేందుకు వెళ్ళిన బ్రాహ్మణ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పథకం కింద సమారు 300 మంది విద్యార్థులు అమెరికా, బిట్రన్ కెనడా, ఆస్ట్రేలియా తదితరదేశాలకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్ళారు. గత కొద్ది కాలం నుంచి సరైన సమయానికి ప్రభుత్వం సాయం అందక పోవడంతో వారు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికాలాంటి దేశాల్లో వారు పడే బాధలు వర్ణనాతీతం. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరిపై ఆర్థికంగా మరింత భారం పడుతోంది. రెండోసారి ట్రంప్ (Trump) అమెరికా అధ్యక్షుడు కాక ముందు ఎర్నింగ్ బై లెర్నింగ్ పద్దతిలో ఇండియా నుంచి వెళ్ళినవిద్యార్థుల అక్కడ ఏదో ఒక చిన్నాచితక ఉద్యోగం చేసుకుంటూ తమపొట్ట పోషించుకుంటూ ఉన్నత విద్యలను అభ్యసించేవారు. కాని ఈ పద్దతిపై అధ్యక్షుడు నిషేదం విధించడంతో స్టూడెంట్ వీసాపై వచ్చిన వారు అక్కడ విద్యను అభ్యసించడం మినహ ఎటువంటి మరో పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ నుంచి చదువు నిమిత్తం అక్కడకు వెళ్ళిన వారికి ఆర్థిక స్థోమత ఉన్న వారి తల్లిదండ్రులు కొంత మొత్తాన్ని పంపుతూ ఆసరగా నిలబడగా, ఎటువంటి ఆర్థిక స్తోమత లేక కేవలం ప్రభుత్వసాయం మీద ఆధారపడే వారు మాత్రం అటు చదువు కొనసాగించలేక, ఇటు ఆర్థాకలితో అలమటిస్తున్నారు. వీరి బాధలను చూడలేక కొంత మంది తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి వారికి పంపుతుంటే, మరి కొంత మంది అప్పులుచేసి వారి తమ పిల్లలకు డబ్బును సర్దుబాటు చేస్తూ అక్కడ వారు ఇబ్బంది పడుతుంటే.. డబ్బును తమ పిల్లలకు పంపి ఇక్కడ వీరు ఇబ్బంది పడుతున్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ప్రస్తుత 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించినప్పటికీ ఇంతవరకు ఒక్క పైసా విడుదల చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. వీటికి కేటాయించిన సొమ్మును ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్ళించిందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన రూ.50 కోట్లు విడుదల చేస్తే పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు చెల్లింపులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆయా సంక్షేమ పథకాలను కొనసాగించాలని భావిస్తే అందుకు తగినట్టుగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప కొత్త దరఖాస్తుల ప్రక్రియ చేపట్టే వీలులేదని వారు వివరించారు. విదేశీ విద్య, బెస్ట్ తదితర పథకాల అమలుతోపాటు గోపన్పల్లి, సూర్యాపేట బ్రాహ్మణ సదన్ల పనులను పూర్తి చేసేందుకు ఈ మేరకు నిధులు అవసరమని వారు పేర్కొన్నారు. ఆందోళన చేస్తాం: బ్రాహ్మణ సంఘాల నాయకులు ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని ఆయా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. అవసర మైతే సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంటిని ముట్ట డించేందుకు కూడా వెనుకాడేదని లేదంటున్నారు.