Affidavit : ఏపీలో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే ఈ కేసులో ఆయన పాత్రను నిర్ధారించేలా ఏపీ ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

అఫిడవిట్లో ఆశ్చర్యకరమైన విషయాలు
అఫిడవిట్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై జరిపిన దర్యాప్తు విషయాలతో విచారణాధికారి నివేదిక ఇచ్చారు. పులివెందుల కోర్టుకు ఇచ్చిన నివేదికను జత చేసి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు అవినాష్రెడ్డి ప్రయత్నించారు. సునీత, నర్రెడ్డి రాజశేఖర్రెడ్డిని ఈ కేసులో ఇరికించాలని చూశారు. అందులో భాగంగానే సీబీఐ అధికారి రామ్సింగ్, సునీత, నర్రెడ్డి రాజశేఖర్రెడ్డిపై కేసు నమోదు చేశారు అని అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
12 రోజుల్లోనే కట్టు కథలు అల్లి
వివేకా పీఏ కృష్ణారెడ్డిని రాంసింగ్ ఎప్పుడూ విచారించలేదని తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అవినాశ్, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారని కృష్ణారెడ్డి చెప్పిన దానిలో నిజం లేదని తెలిపింది. ఏఎస్ఐజీ రామకృష్ణారెడ్డి నివాసంలో తతంగం నడిపారని కేవలం 12 రోజుల్లోనే కట్టు కథలు అల్లి రాంసింగ్, సునీత, నర్రెడ్డిలపై కేసులు నమోదు చేశారని చెప్పింది. తన ఫిర్యాదును బలపరిచే ఒక్క ఆధారాన్ని కూడా కృష్ణారెడ్డి సమర్పించలేకపోయారని తెలిపింది.