టాలీవుడ్ యువహీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నెంబర్- 8 లోని విశ్వక్ సేన్ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు నివసిస్తుండగానే, అతని సోదరి వన్మయి బెడ్రూంలోకి దొంగతనం జరగడం, అది తెల్లవారుజామున గుర్తించబడటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.

మార్చి 16వ తేదీ తెల్లవారుజామున వన్మయి బెడ్రూంలో అసాధారణమైన పరిస్థితి కనిపించింది. వస్తువులన్నీ చిందరవందరగా ఉండటాన్ని గమనించిన ఆమె, అల్మారాలు తెరిచి చూసేసరికి పలు బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయని గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని తన తండ్రి కరాటే రాజు కు తెలియజేయగా, ఆయన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, తెల్లవారుజామున 5:50 గంటల ప్రాంతంలో ఒక అనుమానాస్పద వ్యక్తి బైక్పై ఇంటి వద్దకు చేరుకున్నట్టు గుర్తించారు. దొంగ నేరుగా గేటు తీసుకుని మూడో అంతస్తుకు వెళ్లడం వెనుక డోర్ ద్వారా బెడ్రూంలో ప్రవేశించడం కేవలం 20 నిమిషాల్లోనే పని ముగించుకుని, అదే తీరుగా వెళ్లిపోవడం.ఈ దొంగ ఇంటి అంతర్గత వివరాలు బాగా తెలుసుకున్న వ్యక్తి అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఇంటి లోపల ఉన్న అల్మారాలు గురించి, అందులో ఏవి ఖరీదైనవో ముందుగానే తెలుసుకుని రావడం అనుమానాస్పదంగా మారింది. ఇంట్లో ఉన్నవారికి, ఆ సమయంలో ఏ ఇబ్బందీ కలగకుండా, చక్కగా ప్లాన్ చేసుకున్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు.
విశ్వక్ సేన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదులో, చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.2.20 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రెండు డైమండ్ రింగులు మాయం అయినట్టు సమాచారం. అయితే, ఇంట్లో ఇంకా ఏమైనా వస్తువులు పోయాయా? అనే అంశంపై కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ ఘటనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు, కేసు విచారణ వేగంగా జరగాలని కోరినట్టు సమాచారం. ఇలాంటి అధునాతన సీసీటీవీ సిస్టమ్స్, భద్రతా చర్యలున్నా, ఈ దొంగతనం జరగడం భద్రతాపరమైన సమస్యలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. సెలబ్రిటీల ఇళ్లకు భద్రత ఎంత అవసరమో, ఇటువంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇప్పటివరకు పోలీసులు సీసీటీవీ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో ఉన్నారు. అతని బైక్ వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరో తెలిసిన వ్యక్తి పనే అయ్యుంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టారు.