భారత క్రికెట్ అభిమానులకు గుండెను కలిచేసే వార్త – స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కోహ్లీ రిటైర్మెంట్ భారత క్రీడారంగంలో ఒక గొప్ప శకానికి ముగింపు అని ఆయన పేర్కొన్నారు. దేశానికి సేవ చేసిన అతని కృషి చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు.

కోహ్లీ ఆటతీరుపై ప్రశంసల వర్షం
చంద్రబాబు తన ప్రకటనలో, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడం భారత క్రీడారంగంలో ఒక గొప్ప అధ్యాయానికి ముగింపు పలికింది. అతడి అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, జట్టును నడిపించిన తీరు కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చాయి” అని పేర్కొన్నారు. కోహ్లీ తన ఆటతీరుతో దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాడని, గర్వకారణంగా నిలిచాడని చంద్రబాబు ప్రశంసించారు. విరాట్ కోహ్లీ పేరు వింటేనే ఎన్నో రికార్డులు గుర్తుకు వస్తాయి. టెస్ట్ క్రికెట్లో అతడి పేరుతో ఎన్నో శతకాలు, మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన కోహ్లీ, ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో కెప్టెన్గా, బ్యాట్స్మన్గా భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడని గుర్తుచేశారు. అతడి దృఢ సంకల్పం, దూకుడు యువ క్రీడాకారులకు ఆదర్శప్రాయమని తెలిపారు.
విరాట్ కోహ్లీ వంటి వ్యక్తులు జట్టుకు నాయకులుగా ఉన్నపుడు ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రేరణ పొందుతారు. “విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రస్థానంలో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతడికి నా శుభాకాంక్షలు,” అంటూ చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.
Read also: Gottipati Ravikumar: ఏపీలో యధాతధంగా విద్యుత్ చార్జీలు:మంత్రి గొట్టిపాటి