ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు నిర్వహించిన సభ విజయవంతమైంది. ఈ సభలో అమరావతి అభివృద్ధి ప్రణాళికలు మరియు రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు రూపొందించిన ప్రణాళికలను ప్రధానంగా ప్రస్తావించారు. కేరళ నుంచి విజయవాడ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు వచ్చారు.
మోదీ ప్రసంగం: అమరావతి ఒక శక్తి
ప్రధానమంత్రి మోదీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సన్మానించారు. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని ప్రధాని మోదీ అన్నారు. సర్వాంధ్రప్రదేశ్కు ఇది శుభ సంకేతం అన్నారు. వికాసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజన్ గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి అభివృద్ధి ప్రణాళికలు పూర్తి స్థాయిలో సహకరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలైందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబును ప్రశంసించిన మోదీ
అమరావతి పునర్నిర్మాణ పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. దుర్గా భవాని కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అంటూ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యమని మోదీ అన్నారు. పెద్ద పెద్ద పనుల్ని చేపట్టి పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే లేరన్నారు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశానని, గత ఐదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచిందని మోదీ అన్నారు.
కేంద్ర సహకారం, రైల్వే ప్రాజెక్టులు
ఇప్పుడు అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని, సహకారం కొనసాగిస్తుందని తెలిపారు. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం వేల కోట్లు సాయం చేస్తుందని, దాదాపు 60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామని తెలిపారు. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు, ఏపీ ప్రగతికి బలమైన పునాది కాబోతున్నాయని మోదీ అన్నారు. అమరావతి యువత కలలు సహకారమయ్యే రాజధానిగా ఎదుగుతుందని మోదీ అన్నారు.
అమరావతి అభివృద్ధి, చంద్రబాబు దీమా
మోదీ సహకారంతో అమరావతిని ప్రపంచ స్థాయికి చేరుస్తామని సీఎం చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. అమరావతి రీస్టార్ట్ సభలో మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఐదో స్థాయికి ఎదిగిందని తెలిపారు. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుందని అన్నారు. ఐదు కోట్ల మంది గర్వంగా నా రాజధాని అని చెప్పుకునేలా అమరావతి అభివృద్ధి జరుగుతుందని భరోసా ఇచ్చారు.
భవిష్యత్ నగరంగా అమరావతి
ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతిని తీర్చి దిద్దుతామని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ నగరంగా అమరావతి ఉంటుందని, ప్రపంచంలోని అన్ని నగరాలకు అమరావతిని అనుసంధానం చేస్తామని తెలిపారు. 5 లక్షల మంది విద్యార్థులు అమరావతిలో చదువుకుంటున్నారని అన్నారు. భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. విద్య, వైద్య కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని, గ్రీన్ ఎనర్జీతో కాలుష్య రహితంగా అమరావతి అభివృద్ధి ఉంటుందని తెలిపారు.
పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రసంగాలు
అమరావతి రైతులు గత ఐదేళ్లుగా నలిగిపోయి లాఠీ దెబ్బలు తిన్నారని ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో రైతులను కలిసినప్పుడు మా కన్నీళ్లు తుడిచేది ఎవరని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. అమరావతి రైతుల త్యాగాలకు జవాబుదారీగా ఉంటామని, రాజధాని నిర్మించి వారి రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. దేశమే తన కుటుంబంగా ప్రధాని మోదీ భావిస్తున్నారని కొనియాడారు. మంత్రి నారా లోకేష్ తన స్పీచ్లో పహెల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని అన్నారు. అమరావతి శంకుస్థాపన సభ కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. సభా ప్రాంగణం ఉదయం 11 గంటలకే నిండిపోయింది.