ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ నేవీ ఆఫీసర్ తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. కానీ తన భార్య మాత్రం మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని 15 ముక్కలు చేసి డ్రమ్ములో నింపి సిమెంట్తో కప్పేసింది. చివరికి ఈ అమానుషం బయటపడింది.

ప్రేమించి పెళ్లి, తరువాత ప్రియుడితో అక్రమ సంబంధం
2016లో మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్, తాను ప్రేమించిన ముస్కాన్ రస్తోగిని పెళ్లి చేసుకున్నాడు. వీరి మధ్య ప్రేమ బలంగా ఉండటంతో నేవీ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. అయితే, ఈ నిర్ణయాన్ని ఇరు కుటుంబాలూ మద్దతు ఇవ్వలేదు. కుటుంబ కలహాల నేపథ్యంలో, సౌరభ్ భార్యతో కలిసి అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. 2019లో వీరి జీవితానికి గుర్తుగా ఓ పాప పుట్టింది. కానీ సౌరభ్ తన భార్య కోసం చేసిన త్యాగాలను ఆమె గుర్తించలేదు. ముస్కాన్కి భర్త స్నేహితుడైన సాహిల్ పరిచయం అయ్యాడు. క్రమంగా ఈ పరిచయం అక్రమ సంబంధంగా మారింది. ఫోన్లో మాట్లాడటం, రహస్యంగా కలవడం పెరిగిపోయాయి. భర్త తన అక్రమ సంబంధాన్ని గమనించాడని ముస్కాన్ అనుకుంది. దీంతో విడాకులు తీసుకునేందుకు సౌరభ్ సిద్ధమయ్యాడు. అయితే తన కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కుటుంబాన్ని విడదీయకూడదనుకున్నాడు. 2023లో మళ్లీ నేవీ ఉద్యోగంలో చేరాడు. ఇది ముస్కాన్, సాహిల్కు అడ్డుగా మారింది. సాహిల్తో కలిసి ఉండేందుకు భర్తను చంపాలని ముస్కాన్ ప్లాన్ వేసింది.
హత్యకు పథకం
ఫిబ్రవరి 28న ముస్కాన్-సాహిల్ హత్యకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 24న సౌరభ్ విదేశాల నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. తన కుమార్తె పుట్టినరోజును ఘనంగా జరిపాడు. అదే సమయంలో ముస్కాన్ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు గట్టి ప్రణాళిక వేసింది. భర్తకు నిద్ర మాత్రలు కలిపిన పాలు ఇచ్చింది. స్పృహ తప్పగానే సాహిల్తో కలిసి సౌరభ్ను ఊపిరాడనివ్వకుండా చంపేశారు. అదే రాత్రి మృతదేహాన్ని 15 ముక్కలుగా కోసి డ్రమ్ములో పెట్టారు. వాసన రాకుండా సిమెంట్ పోసి సీల్ చేశారు. భర్త హత్య బయటపడకుండా ఉండటానికి ముస్కాన్ అతడి మొబైల్ తీసుకుని ప్రియుడితో మనాలి వెళ్లింది. భర్త వెళ్లిపోయినట్టు నటిస్తూ, అతడి ఫోన్తో అక్కడ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కుటుంబసభ్యులు, స్నేహితులు భర్తను ఆరా తీయగా మనాలి వెళ్లాడు అని చెప్పింది. అయితే అతడు ఎవరితోనూ మాట్లాడకపోవడం, ఇంటి వద్ద ఆమె లేకపోవడం అనుమానాలు రేకెత్తించింది. సౌరభ్ స్నేహితులు, కుటుంబసభ్యులు అతడి ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్కాన్ ఇంటికి వచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు సౌరభ్ మృతదేహం ఉన్న డ్రమ్మును స్వాధీనం చేసుకున్నారు. అయితే అది సిమెంట్తో గట్టిగా కప్పి ఉండటంతో రంపాలతో కోసి మృతదేహం భాగాలను బయటకు తీశారు. ఈ దారుణ ఘటన చూసిన పోలీసులు కూడా కంటతడి పెట్టుకున్నారు. నిందితులు ముస్కాన్, సాహిల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చేసిన దారుణాన్ని వారు అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. కాగా, భర్తను హత్య చేసిన తమ కుమార్తెకు ఉరిశిక్ష విధించాలని ముస్కాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కోటీశ్వరుడైన సౌరభ్ తమ కుమార్తెను ఎంతగానో ప్రేమించాడని, అతడిని తల్లిదండ్రులకు దూరం చేసిన ముస్కాన్ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు.