US layoffs : అమెరికాలో ఉద్యోగ మాంద్యం .. మనోళ్లపై ప్రభావం అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన ఎన్నారైలు భారత్కి వచ్చాక సరైన అవకాశాలు దొరకడం లేదు. భారతీయ కంపెనీలు అధిక జీతాలతో వారిని నియమించేందుకు ఇష్టపడకపోవడం, స్థానిక అభ్యర్థులతో తక్కువ జీతాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం దీనికి ప్రధాన కారణం.గత రెండు సంవత్సరాలుగా అమెరికాలో ఉద్యోగ కోతలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వ విధానాల కారణంగా పరిస్థితి మరింత కఠినమవుతోంది. అక్కడ ఉద్యోగ భద్రత లేనందున, చాలా మంది భారత్కి రావాలా? అక్కడే ఉండాలా? అనే సంక్షయంతో ఉన్నారు. కొందరు ధైర్యం చేసి స్వదేశానికి వచ్చినా, ఇక్కడ సరైన ఉద్యోగం దొరక్క భాదపడుతున్నారు.

రియల్ లైఫ్ స్టోరీ – ఎన్నారై రాజ్ పరిస్థితి
ఉదాహరణగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజ్ (పేరు మార్పు) ఏడేళ్ల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. మాస్టర్స్ పూర్తయిన వెంటనే ఓ కంపెనీలో ఉద్యోగం కూడా సాధించాడు. అతని నెల జీతం భారతీయ కరెన్సీలో దాదాపు ఆరు లక్షల రూపాయలు. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా గత ఏడాది అతని ఉద్యోగం పోయింది. భారత్కి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక్కడ ఉద్యోగం కోసం హైదరాబాద్, బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాల్లో అన్వేషిస్తున్నా, ఆరు నెలలుగా అతనికి ఉద్యోగం దొరకలేదు. ఐదుగురు మాత్రమే ఇంటర్వ్యూకు పిలిచారు, కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. తన అనుభవాన్ని తక్కువ జీతంతో వాడుకోవాలనుకుంటున్న సంస్థల వైఖరి వల్ల ఇబ్బంది పడుతున్నాడు.
ఎందుకు ఎన్నారైలకు అవకాశాలు తగ్గుతున్నాయి?
ఇండియాస్ గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఇండెక్స్ 2025 ప్రకారం, మన పట్టభద్రుల్లో కేవలం 42.6% మంది మాత్రమే ఉద్యోగానికి అర్హులు. ఏఐ, డేటా ఎనలిటిక్స్ వంటి నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతున్నా, వాటిని నేర్చుకున్నవారి సంఖ్య తక్కువ. విదేశాల నుంచి వచ్చే అభ్యర్థుల్లోనూ ఈ స్కిల్స్ కొరత ఉంది.భారతీయ కంపెనీలు అధిక జీతం చెల్లించకుండా స్థానిక అభ్యర్థులను తక్కువ జీతంలో నియమించడమే ఇందుకు ప్రధాన కారణం. సంస్థల ప్రాధాన్యతకు తగ్గట్టుగా ఆడ్జస్ట్ కాకపోతే ఎన్నారైలు ఇక్కడ ఉద్యోగం పొందడం కష్టమే.
నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
భారతీయ కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి స్కిల్స్ను ఎక్కువగా కోరుకుంటున్నాయి. విదేశాల నుంచి వచ్చేవారు ఈ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం అవసరం. అలాగే, ఉద్యోగ అవకాశాలను పెంచుకోవాలంటే, నెట్వర్క్ విస్తరించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, లింక్డిన్, రెడిట్ వంటి వేదికల్లో సాన్నిహిత్యాలు పెంచుకోవడం ద్వారా అవకాశాలు పెరుగుతాయి.
స్టార్టప్ సంస్కృతిని ఉపయోగించుకోవాలి
ఇండియాలో స్టార్టప్ల సంస్కృతి వేగంగా పెరుగుతోంది. విదేశాల్లో అనుభవం ఉన్నవారు ఉద్యోగం వెతకడమే కాకుండా, స్వంతంగా స్టార్టప్లను ప్రారంభించేందుకు ప్రయత్నించాలి. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే సూచిస్తున్నారు.ఇకనుంచి విదేశాల నుంచి భారత్కి రాగానే ఉద్యోగం దొరుకుతుందని ఆశించకుండా, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం, సరికొత్త అవకాశాలను అన్వేషించడం చాలా ముఖ్యం.