కన్నడ సినిమా పరిశ్రమలో ‘రియల్ స్టార్’గా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర (Upendra), ఆయన భార్య, నటి–నిర్మాత ప్రియాంక, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఇది ఒక సాధారణమైన ఆన్లైన్ మోసంగా కనిపించినా, వ్యక్తిగత గోప్యత, డిజిటల్ భద్రత విషయంలో ఎంత జాగ్రత్త అవసరమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.
సోషల్ మీడియాలో ఉపేంద్ర స్వయంగా పోస్ట్ చేస్తూ ఈ విషయం అభిమానులకు వెల్లడించారు. “జాగ్రత్తగా ఉండండి, మా ఇద్దరి ఫోన్లు కూడా హ్యాక్ (Hack) అయ్యాయి” అని ఆయన హెచ్చరించారు. ఇలాంటి మోసాలు కేవలం ప్రసిద్ధులకు మాత్రమే కాదు, సామాన్యులకు కూడా ఎదురయ్యే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

నా భార్య ఫోన్, ఆ తర్వాత నా ఫోన్ హ్యాక్ అయ్యాయి
వివరాల్లోకి వెళితే, ఉపేంద్ర భార్య ప్రియాంక (Upendra’s wife Priyanka) కు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆర్డర్ చేసిన వస్తువు డెలివరీ కోసం కాల్ చేస్తున్నట్లు నమ్మబలికాడు. డెలివరీ ప్రక్రియ పూర్తి కావాలంటే కొన్ని హ్యాష్ట్యాగ్లు, నంబర్లను ఫోన్లో ఎంటర్ చేయాలని సూచించాడు. అది నిజమని నమ్మిన ఆమె, అవతలి వ్యక్తి చెప్పినట్లే చేయడంతో ఫోన్ హ్యాకింగ్ (Hacking) కు గురైందని ఉపేంద్ర తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తన ఫోన్ కూడా హ్యాక్ అయిందని ఆయన వివరించారు.ఈ ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు.
“నా భార్య ఫోన్, ఆ తర్వాత నా ఫోన్ హ్యాక్ అయ్యాయి. మా ఫోన్ నంబర్ల నుంచి గానీ, సోషల్ మీడియా ఖాతాల నుంచి గానీ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే దయచేసి స్పందించవద్దు. అలాంటి మెసేజ్లు లేదా కాల్స్ వస్తే ఏమాత్రం డబ్బు పంపొద్దు” అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాల (Cyber crimes) పట్ల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో, సామాన్య ప్రజలు ఆన్లైన్ మోసాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: