ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పి నమ్మించిన ఇద్దరు యువకులు వారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పరిధిలో సంచలనం రేపింది.ఆకుల సాత్విక్ (26) – దమ్మాయిగూడకు చెందిన వ్యక్తి,కర్నాటి మోహనచంద్ (28) – ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి,ఈ ఇద్దరు స్నేహితులు ఇన్స్టాగ్రామ్ ద్వారా మచ్చబొల్లారానికి చెందిన ఇద్దరు బాలికలతో పరిచయం ఏర్పరచుకున్నారు. బాధిత బాలికలు 9వ తరగతి విద్యార్థినులు, అయితే వారు మధ్యలోనే చదువు ఆపివేశారు.
ఇన్స్టాగ్రామ్ పరిచయం
గత ఐదు నెలలుగా ఈ యువకులు ఇన్స్టాగ్రామ్లో బాలికలతో చాట్ చేస్తున్నారు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి నమ్మించారు. బాలికలు వారి మాటలను నమ్మి బుధవారం ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిపోయారు. అయితే రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై, వెంటనే అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణ
ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. బాలికల ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించి, వారి చివరి లొకేషన్ను ట్రాక్ చేయగా, వారు ఈసీఐఎల్లోని ఓయో లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు.అర్ధరాత్రి ప్రత్యేక బృందంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాలికలను రక్షించారు. విచారణలో యువకులు బాలికలపై అత్యాచారం చేసినట్లు స్పష్టమైంది. దీంతో ఆకుల సాత్విక్, కర్నాటి మోహనచంద్లను అరెస్టు చేసి, వారిపై పోక్సో చట్టం (ప్రొటెక్షన్ అఫ్ చిల్డ్రన్ ఫ్రొమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ ఆక్ట్), కిడ్నాప్ కేసులు నమోదు చేశారు.

బాలికలకు వైద్య పరీక్షలు
బాధిత బాలికలను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అంతేకాక, నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి వయసు ధృవీకరణ లేకుండానే బాలికలను లాడ్జిలోకి అనుమతించిన ఓయో హోటల్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియా
ఈ ఘటన యువతకు మరియు తల్లిదండ్రులకు పాఠంగా మారాలి. సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, పిల్లలపై తల్లిదండ్రులు కట్టుదిట్టమైన పర్యవేక్షణ కలిగి ఉండాలి.ఇంటర్నెట్లో ఎవరితో చాట్ చేస్తున్నారు?ఎటువంటి సమాచారాన్ని పంచుకుంటున్నారు?ఎవరితో బయటికి వెళుతున్నారు?
ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించాలి.