తిరుమల: శ్రీవారి భక్తులకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ నెల 6 నుంచి వడలు కూడా అందించనున్నట్లు సమాచారం. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్రయల్ రన్లో భాగంగా దాదాపు 5వేల మంది భక్తులకు ఉల్లిపాయలు వాడకుండా చేసిన మసాలా వడలను వడ్డించారు.
ఇక, ఈ నెల 6వ తేదీ నుంచి పూర్తి స్థాయి అమల్లోకి తెచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా తిరుమలలో మంచి నీటి కోసం వినియోగిస్తున్న గాజు సీసాల స్థానంలో కొత్తగా టెట్రా ప్యాకెట్ లు అందుబాటు లోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానుంది.

తెలంగాణ నేతలు ఆగ్రహం
తిరుమలలో శ్రీవారి బ్రేక్ దర్శనాల కోసం టీటీడీ పైన ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్, రూ.300 దర్శన టికెట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో మరింతగా లేఖల సంఖ్య పెరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. తమ లేఖలు తీసుకోవటం లేదని తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి ఏపీ ప్రజాప్రతినిధుల ద్వారానే 1,800 నుంచి 2 వేల వరకు బ్రేక్ దర్శనాలకు టికెట్లు ఇస్తున్నట్లు సమాచారం.
పెరిగిన బ్రేక్ దర్శన సిఫారసులు
అన్ని కేటగిరీల్లోనూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రోజుకు దాదాపు 7 వేల నుంచి 7,500 వరకు ఇవ్వాల్సి వస్తుందని వాపోతున్నారు. వీరందరికీ దర్శనం చేయించడానికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమయం తీసుకుంటున్నారు. పెరిగిన బ్రేక్ దర్శన సిఫారసులను ఎక్కడ తగ్గించాలో అర్థంకాక టీటీడీ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. తెలంగాణ సిఫార్సు లేఖలతో వస్తున్న భక్తులు తమ లేఖలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.