తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి ఉద్యమ పంథా ఎక్కారు. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో బస్సులు ఆగిపోవొచ్చన్న హెచ్చరిక జేఏసీ నుంచి వచ్చింది.తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ మేరకు అధికారికంగా సమ్మె నోటీసు ఇచ్చారు. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు, కార్మిక శాఖ కమిషనర్కు నోటీసును అందజేశారు. మే 7 నుంచి మొదటి షిఫ్ట్ నుంచే బహిష్కరణ ఉంటుందని స్పష్టం చేశారు.ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలే కార్మికుల డిమాండ్. మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఇంకా అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు కూడా ఇప్పటి వరకు పూర్తిగా ఇవ్వలేదన్న ఆరోపణ చేశారు.

“ప్రతిష్టతో చేస్తున్న మా ఉద్యోగాన్ని తక్కువ చేయొద్దు”
సంస్థను బలోపేతం చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఉద్యోగుల వైపు చూడడం లేదని కార్మికులు వాపోతున్నారు. తమ త్యాగాలు గుర్తించకుండా ప్రభుత్వం మొండివైఖరి చూపుతోందని ఆరోపిస్తున్నారు. “వేతనాలు ఆలస్యం కావడం రొటీన్ అయింది” అంటున్నారు.వేతనాల సమస్యతో పాటు, ప్రోమోషన్లు, వర్క్ షిఫ్ట్లు, ఆరోగ్య బీమా వంటి అంశాలపై అధికారులు పట్టించుకోవడం లేదని జేఏసీ ఆరోపిస్తోంది. వారు చెబుతున్నదేమిటంటే – “ఇప్పటికైనా ప్రభుత్వానికి మేలుకొలుపు కావాలి.”
సమ్మె ప్రభావం ఎలా ఉండబోతుంది?
బస్సులు ఆగితే, దానిప్రమాదం నేరుగా ప్రజలపై పడుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు – అందరూ ప్రభావితమయ్యే పరిస్థితి. దీంతో ప్రభుత్వం ముందే స్పందించి పరిష్కారం కనుగొనాలి అన్నది ప్రజల ఆకాంక్ష.జేఏసీ తాజాగా ఇచ్చిన సమ్మె నోటీసుతో అధికారులు అప్రమత్తమయ్యే అవకాశముంది. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు ప్రారంభిస్తే, సమ్మె తప్పించుకోవచ్చు. లేకపోతే మరోసారి రోడ్లపై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది.