భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం సహా అనేక అంశాలపై చర్చించుకున్నట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా నుంచి ఆయుధ కొనుగోళ్లు సహా బైలేటరల్ ట్రేడ్ వంటి అంశాలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపింది. ఈ విషయంలో ట్రంప్, భారత్పై ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది. చర్చల్లో భాగంగా అమెరికా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుగోలును పెంచుకోవాలని భారత్ను ట్రంప్ కోరినట్లు వైట్ హౌస్ స్వయంగా ప్రకటించింది. తద్వారా ఇరు దేశాల మధ్య ఫెయిర్ బైలేటరల్ ట్రేడింగ్ రిలేషన్షిప్ను నెలకొల్పాలని సూచించినట్లు తెలిపింది.
దీనివల్ల రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పినట్లు వెల్లడించింది. పొరుగుదేశం చైనా నుంచి భద్రతాపరంగా భారత్ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయుధ సంపత్తి, డిఫెన్స్ టెక్నాలజీలో చైనా చాలా అడ్వాన్స్గా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ సైతం చైనాకు దీటుగా సైన్యం, సైనిక వ్యవస్థలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా మోడ్రన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ను సమకూర్చుకోవాలని యోచిస్తోంది.

ఫైటర్ జెట్లు, సబ్మెరైన్లు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, అసాల్ట్ రైఫిళ్ల విషయంలో చాలా అప్గ్రేడ్ కావాల్సి ఉందన్న విషయాన్ని గుర్తించింది. డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో చాలా వెనకబడి ఉండడం గమనించింది. అదే సమయంలో దేశీయంగానూ డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఆయుధాల తయారీని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆ దిశగా పనిచేస్తున్న కంపెనీలకు సహకారం అందించాలని సైన్యానికి సూచించింది. మరోవైపు భారత్ సహా బ్రిక్స్ కూటమిలోని దేశాలు అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నాయంటూ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇది అమెరికాకు హాని చేయడమేనని వ్యాఖ్యానించారు. అందుకు ప్రతీకారంగా తాము కూడా భారత్, చైనా, బ్రెజిల్ దేశాల వస్తువులు, సేవలపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.