బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో డాలర్ను వినియోగించడం మానేస్తే, అమెరికా వాటిపై 100 శాతం పన్నులు విధిస్తుందని ట్రంప్ అన్నారు. బ్రిక్స్ దేశాలు డాలర్ కాకుండా కొత్త బ్రిక్స్ కరెన్సీని ఏర్పాటు చేసుకుంటే, అమెరికా చూస్తూ మౌనంగా కూర్చోదని సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ హెచ్చరించారు. కెనడా, మెక్సికోలపై ట్రంప్ సుంకాలను ప్రకటించారు. బ్రిక్స్ వ్యవస్థాపక దేశాల్లో భారత్ ఒకటి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో అమెరికా పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కూడా ట్రంప్ ఇంతకుముందు చెప్పారు.

ట్రంప్ ఏమన్నారంటే..
బ్రిక్స్ దేశాలు డాలర్ను కాదని దూరం జరుగుతుంటే, అమెరికా చూస్తూ ఉండే శకం ముగిసిందని ట్రంప్ అన్నారు. ఈ దేశాలు కొత్త బ్రిక్స్ కరెన్సీని సష్టించబోమని, లేదా శక్తిమంతమైన డాలర్ను భర్తీ చేసేలా మరే కరెన్సీకి మద్దతు ఇవ్వబోయేది లేదన్న నిబద్దత ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ట్రూత్ సోషల్లో ఆయన ఇలా రాశారు, ”వాళ్లు అలా చేస్తే వంద శాతం సుంకాలను భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, అమెరికా లాంటి గొప్పదేశానికి వారి వస్తువులు విక్రయించాలనే కలను వదులుకోవాల్సి ఉంటుంది.”
భారత్ వైఖరి ఎలా ఉండొచ్చు?
భారత్ వైఖరి కూడా డాలర్ వ్యవహారంలో కానీ, ఇతర వాణిజ్య విషయాల్లో కానీ ట్రంప్ ప్రభుత్వంతో ఘర్షణపడే ఉద్దేశం లేదన్నట్లుగానే సూచిస్తోంది. ట్రంప్ను భారత్కు స్నేహితుడిగా లేదా శత్రువుగా భావిస్తున్నారా? అని గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ను అడిగారు. దానికి ఆయన బదులిస్తూ, డోనల్డ్ ట్రంప్ ‘అమెరికన్ నేషనలిస్ట్’ (అమెరికా జాతీయవాది) అన్నారు. ట్రంప్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని, అయితే తమ ప్రయోజనాలకు అనుగుణంగా భారత్ నిర్ణయాలు ఉంటాయని ఆయన చెప్పారు.