ట్రంప్పై గతంలో నేర నిర్ధరణ
ఒట్టావా : కెనడా ప్రతిపక్ష ఎన్డీపీ (నేషనల్ డెమోక్రటిక్ పార్టీ) నేత, ఖలిస్థానీ సానుభూతిపరుడు జగ్మీత్ సింగ్ బుధవారం జగ్మీత్ సింగ్ మాట్రియాల్ కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ సమావేశంలో మాట్లాడుతూ..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను నేరస్థుడిగా అభివర్ణించారు. ఆయన్ను జి-7 సదస్సు కోసం కెనడా భూభాగంపై అడుగుపెట్టనీయకుండా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రంప్పై గతంలో నేర నిర్ధరణ జరిగిన అంశం, ప్రపంచ దేశాలకు ఆయన బెదిరింపులను ఇందుకు ఓ కారణంగా పేర్కొన్నారు.

మన దేశంలోకి ఎందుకు రానివ్వాలి
ట్రంప్ను జీ7 సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని నేను నమ్ముతున్నాను. ఆయన్ను ఇక్కడికి పిలవకూడదు. నేరనిర్ధరణ జరిగిన వ్యక్తిని మన దేశంలోకి ఎందుకు రానివ్వాలి. మన ప్రజాస్వామ్యానికి, సార్వభౌమత్వానికి ముప్పుగా మారి, మన ఆర్థికవ్యవస్థను, మన మిత్రులను, ప్రపంచాన్ని బెదిరించిన వ్యక్తిని ఎందుకు అనుమతించాలి. డొనాల్డ్ ట్రంప్ను ఎలా అడ్డుకోవాలని అన్నదానిపైనే నేటి సమావేశం అని వ్యాఖ్యానించారు. ట్రంప్ను ఆపేందుకు జీ7 వేదికను వాడుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని, మిత్రదేశాలను ఆయన అభ్యర్థించారు. ఆయన్ను ఎదుర్కోడానికి మెక్సికో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి భావ సారూప్యత ఉన్న దేశాలతో జట్టు కట్టాలన్నారు. అత్యాధునిక ఆయుధాలతో కెనడా సైన్యాన్ని బలోపేతం చేయడానికి ఎన్డీపీ మద్దతు ఇస్తుందన్నారు.
ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో చాలావరకు తనకు కోపం
సింగ్ ప్రకటనపై ఇప్పటివరకు కెనడా ప్రభుత్వం స్పందించలేదు. ప్రధాని కార్యాలయ ప్రతినిధి సైమన్ లాఫార్చ్యూ స్పందిస్తూ దీనిపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని వెల్లడించారు. ఇక ఇంధన శాఖ మంత్రి జోనాథన్ విల్కిన్సన్ మాట్లాడుతూ.. జగ్మీత్ ప్రతిపాదనలో అంతగా విషయం లేదన్నారు. అంతేకాదు.. ఆలోచించి సలహాలు చెప్పేవారిని తాము కొత్త అడ్వైజర్లుగా నియమించుకోమని హితవు పలికారు. అంతేకాదు.. ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో చాలావరకు తనకు కోపం తెప్పించాయన్నారు. అదే సమయంలో కలిసి పనిచేసే మార్గాలను వెతకాలని సూచించారు. మనం తెగదెంపులు చేసుకొని సముద్రంలో మరో చోటుకు వెళ్లిపోలేము కదా. వారు మన పొరుగువారు. కలిసే ముందుకెళ్లాలి అని పేర్కొన్నారు. జూన్ 15 నుంచి 17 వరకు అల్బర్టాలో జీ7 సమావేశాలు జరగనున్నాయి.