Trump : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వివిధ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలకు కోత విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో సంస్కరణలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా 20 నుంచి 25 శాతం సిబ్బందికి లే ఆఫ్లు ఇవ్వనున్నట్లు యూఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అధికారులు వెల్లడించారు. వీరిలో ముందుగా పౌర హక్కుల కార్యాలయ ఉద్యోగులపై వేటు పడనున్నట్లు తెలిపారు. ఈమేరకు సిబ్బందికి మెయిల్స్ వెళ్లాయన్నారు.

పౌర హక్కుల కార్యాలయం నుంచి 75శాతం మందిని
ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వివిధ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలకు కోత విధిస్తున్న అమెరికా ప్రభుత్వం ఆదేశాల మేరకు యూఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమయ్యింది. దీని ఫలితంగా రెవెన్యూ విభాగానికి చెందిన బహుళ కార్యాలయాలు, ఉద్యోగాల్లోని సిబ్బందిపై వేటు పడనుంది అని రెవెన్యూ ఉద్యోగులకు పంపిన మెయిల్స్లో పేర్కొన్నారు. పౌర హక్కుల కార్యాలయం నుంచి 75శాతం మందిని తొలగిస్తామని.. మిగిలిన ఉద్యోగులను ప్రత్యేక కార్యాలయం కిందకు మారుస్తామని.. దశలవారీగా తొలగింపులు జరుగుతాయని అందులో తెలిపారు. కాగా ఫెడరల్ వర్క్ఫోర్స్ నుంచి ఇప్పటికే రెండు లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు.
కార్మిక శక్తిని 82 వేల నుంచి 62 వేలకు తగ్గించుకోనున్నట్లు
ప్రభుత్వ ఉద్యోగాల కోతల్లో భాగంగా ట్రంప్ యంత్రాంగం ఇటీవల అక్కడి ఆరోగ్య విభాగంపై కొరడా ఝలిపించింది. ఇందులోభాగంగా 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఇటీవల ప్రకటించారు. తద్వారా ఏడాదికి దాదాపు 1.8 బిలియన్ డాలర్లు ఆదా అవుతుందన్నారు. కార్మిక శక్తిని 82 వేల నుంచి 62 వేలకు తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగాల తొలగింపునకు ట్రంప్ సర్కారు బైఅవుట్ను అస్త్రంగా చేసుకుంది. ఈమేరకు ఒక ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు.