అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెర లేపారు. కెనడా, మెక్సికోపై 25%, చైనాపై 10% కొత్త టారిఫ్స్ విధించాలని నిర్ణయించారు. ఈ దేశాల దిగుమతులపై కొత్త టారిఫ్లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయి. దీంతో యూఎస్ కీలక వాణిజ్య భాగస్వాముల్లో ఆందోళన నెలకొంది. అమెరికా $1 ట్రిలియన్ వాణిజ్య లోటును తగ్గించే లక్ష్యంతో ట్రంప్ ఈ 3 ట్రేడ్ పార్ట్నర్స్ను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ప్రతిసారీ ఇండియన్ టారిఫ్ స్ట్రక్చర్పై విమర్శలు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి భారత్ను లక్ష్యంగా చేసుకోలేదు. దీంతో త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టబోయే యూఎస్ పర్యటన కీలక ద్వైపాక్షిక వాణిజ్య చర్చలకు వేదిక కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ టారిఫ్స్ ఉచ్చులో పడకుండా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాజా యూనియన్ బడ్జెట్ (2025-26లో కొన్ని యూఎస్ నుంచి వచ్చే ఎగుమతులపై, దిగుమతి సుంకాలను తగ్గించింది. బైక్స్ (1,600cc లోపు), శాటిలైట్ గ్రౌండ్ ఇన్స్టాలేషన్స్, సింథటిక్ ఫ్లేవర్ ఎసెన్స్ సహా ఇతర అమెరికన్ ఎగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించింది. దీంతో ఈ నిర్ణయం యూఎస్ ఎగుమతులకు ప్రోత్సాహకంగా నిలవనుంది. ఇది రెండు దేశాల ట్రేడ్ డెఫిసిట్ బ్యాలెన్స్ చేసే చర్యగా చెప్పుకోవచ్చు. దీంతో ట్రంప్ హిట్ లిస్టులో ఇండియా ఉండకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.