మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఉద్ఘాటించారు. ఈ మేరకు రష్యా అధికారిక టెలివిజన్ పుతిన్ మాట్లాడుతూ.. ట్రంప్పై ప్రశంసలు కురిపించారు. ఆయన స్మార్ట్ అంటూ ఆకాశానికెత్తేశారు. అంతేకాదు, 2020 అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గనక విజయం సాధించి ఉంటే ఉక్రెయిన్తో యుద్ధం వచ్చుండేది కాదని వ్యాఖ్యానించారు. కానీ, అమెరికాతో సంప్రదింపులు విషయమై మాత్రం పుతిన్ స్పష్టతనివ్వలేదు. పుతిన్ను కలిసి మాట్లాడేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు ఇటీవల ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, వాషింగ్టన్ నుంచి పిలుపుకోసం తాను ఎదురుచూస్తున్నట్లు పుతిన్ అన్నారు.
కాగా, ఉక్రెయిన్ – రష్యా యుద్ధంపై ఎప్పుడు స్పందించినా ట్రంప్ ఒకమాట చెబుతూ వస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో కనుక తాను గెలిచి ఉంటే రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరగనిచ్చే వాడిని కాదని చెబుతున్నారు. తాజాగా పుతిన్ ఈ విషయం నిజమేనని, ట్రంప్ అందుకు సమర్థుడని ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్తో పొడసూపిన విభేదాలపై సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఇకపోతే.. అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ట్రంప్ స్పందించారు. సంఘర్షణ ముగించేలా పుతిన్ చర్చలకు రాకుంటే రష్యాపై మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. యుద్ధాన్ని ఆపకుంటే రష్యాపై అధిక టారిఫ్లు, పన్నులు వడ్డిస్తామని, పలు ఆంక్షలు విధిస్తానని అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇటీవల దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులోనూ ఉక్రెయిన్ సంక్షోభంపై ట్రంప్ మాట్లాడారు. చమురు ధరలు తగ్గించాలని సౌదీ సహా ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి)ను కోరతానని, ఒకవేళ వాటి ధరలు తగ్గితే అప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని అని ట్రంప్ అశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.