హైదరాబాద్: శీతాకాల విడిది కోసం నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ రాష్ట్రపతి ముర్ము ఇక్కడ బస చేయనున్నారు. అంతేకాక వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. బుధవారం రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ముర్ము ప్రారంభిస్తారు. 20న (శుక్రవారం) రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఎట్ హోం నిర్వహిస్తారు.
ఈ రోజు ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొనున్నారు. ఇక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటలోని వాయుదళ శిక్షణ కేంద్రానికి సాయంత్రం 5.15 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటారు.
కాగా.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్న భవనాన్ని 1860లో నిజాం నవాబు నజీరుద్దౌలా నిర్మించారు. సాలర్జంగ్ ప్రధానిగా ఉన్న సమయంలో బొల్లారం(Bollaram) నిజాం ప్రభుత్వం అధీనంలోని ఒక కంటోన్మెంట్(Cantonment) ప్రాంతంగా ఉండి, ప్రధాన సైనికాధికారి నివాసంగా ఉండేది. 1950లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దక్షిణాదిలో రాష్ట్రపతి విడిది కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిథి గృహంగా మార్చి ఈ భవనాన్ని రాష్ట్రపతి నిలయంగా నామకరణం చేశారు. 90 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో భవనాన్ని 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో మూడు ప్రధాన విభాగాలు ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి, కుటుంబ సభ్యులు, ఏడీసీ విభాగాలుగా విభజించారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో మరో 20 గదులను నిర్మించారు.