Kejriwal: బీజేపీపై మరోసారి ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్సింగ్, సంఘ సంస్కర్త అంబేడ్కర్ వారసత్వాన్ని కాషాయపార్టీ విస్మరిస్తోందని మండిపడ్డారు. వారి తీరు బ్రిటిష్ వాళ్ల కంటే దారుణంగా ఉందన్నారు. ‘ఏక్ శామ్ షహీదోంకే నామ్’ పేరుతో దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన కేజ్రీవాల్.. తమ పార్టీ మాత్రం భగత్సింగ్, అంబేడ్కర్ల ఆశయాలను నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చిందన్నారు.

గాంధీజీ చిత్రపటం లేదు
బాబాసాహెబ్ అంబేడ్కర్, భగత్ సింగ్లు మాకు ఆదర్శం. మా కార్యాలయంతోపాటు పంజాబ్లోని ప్రతి ఆఫీసులో వారి ఫొటోలే ఉంటాయి. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ఫొటోలను తొలగించి వారికి నచ్చిన వాళ్లవి పెట్టుకున్నారు. గాంధీజీ చిత్రపటం లేదని విమర్శించిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు మౌనంగా ఉంది. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి అని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రస్తుత పాలకులు బ్రిటిష్ కంటే దారుణంగా ఉన్నారని మండిపడ్డారు.
ఇప్పటికే మహిళలకు రూ.2500 ఇవ్వాల్సింది
ఢిల్లీలో బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. యాప్ డౌన్లోడ్ చేసుకోకుంటే కండక్టర్లు పింక్ టికెట్ ఇవ్వడం లేదన్నారు. సౌకర్యాలు కల్పించకపోగా.. గతంలో ఉన్న వాటిని ఉపసంహరించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే మహిళలకు రూ.2500 ఇవ్వాల్సి ఉందని, కానీ ఇంకా ఆ కార్యక్రమం ప్రారంభించలేదన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని కేజ్రీవాల్ ఆరోపించారు.