Tahawwur Rana: అమెరికా నిర్బంధంలో ఉన్న ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు తహావుర్ హుస్సేన్ రాణాను నేడు భారత్ కు ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 10) అతను భారత్కు చేరుకుంటాడని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తహావుర్ అప్పగింతకు న్యాయ సంబంధమైన అవరోధాలన్నీ తొలగిపోవడంతో ఇండియాకు తీసుకొస్తున్నారు. 26/11 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన రాణా ఈ కేసులో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. అయితే, 2008లో నవంబర్ 26వ తేదీన జరిగిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి సుమారు 166 మందిని చంపేశారు.

ముంబైలోని కీలక లక్ష్యాలపై నిఘా
పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త అయిన రాణా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)లో చురుకైన పాత్ర పోషించాడు. ముంబైలోని కీలక లక్ష్యాలపై నిఘా పెట్టిన పాకిస్థానీ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి ప్రయాణ పత్రాలు సులభంగా ఇప్పించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. అనంతరం పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీ నుంచి లాజిస్టిక్స్, వ్యూహాత్మక మద్దతుతో ఉగ్రవాదులు ముంబైలో దాడికి పాల్పడ్డారు.
అప్పగింతకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ
ముంబై ఉగ్రదాడిలో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్ను సజీవంగా పట్టుకున్నారు. విచారణ అనంతరం అతడిని ఉరితీశారు. కాగా, ఈ దాడుల వెనుక సూత్రధారి రాణాను తాత్కాలికంగా తమకు అప్పగించాలంటూ జూన్ 2020లో అమెరికాను భారత్ అభ్యర్థించింది. అప్పగింతకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించింది. రాణా అప్పగింతను ఫిబ్రవరిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. తనను భారత్కు అప్పగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ తహావుర్ రాణా దాఖలు చేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 64 ఏళ్ల ఈ వ్యాపారవేత్త ప్రస్తుతం లాస్ ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు.