యూపీలోని పిలిభిత్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటన స్థలంలో AK-సిరీస్ అసాల్ట్ రైఫిళ్లు మరియు రెండు గ్లోక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. నిందితులను గురుదాస్పూర్కు చెందిన గుర్విందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ (18)గా గుర్తించారు.
ఎస్పీ పిలిభిత్ అవినాష్ పాండే మాట్లాడుతూ..“పంజాబ్ పోలీసుల బృందం SHO పురాన్పూర్ పోలీస్ స్టేషన్ను సంప్రదించి, పోలీసు అవుట్పోస్ట్పై దాడి చేసిన పంజాబ్కు చెందిన కొంతమంది ఉగ్రవాదులు పురాన్పూర్ ప్రాంతంలో తలదాచుకున్నారని సమాచారం అందించింది. వెంటనే మేము ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాము. ఖమారియా పాయింట్ వద్ద ఒక పోలీసు పికెట్ బృందం బైక్పై ముగ్గురు అనుమానితుల గురించి సమాచారాన్ని అందజేసింది.
వెంటనే పిలిభిత్, పంజాబ్ పోలీసుల సంయుక్త బృందం వారిని వెంబడించింది. బైక్పై వచ్చిన నిందితులు పోలీసు బృందంపై కాల్పులు జరపగా, ప్రతీకారంగా పోలీసు అధికారులు కూడా వారిపై కాల్పులు జరిపారు. అనుమానితులకు బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని మేము ఆసుపత్రిలో చేర్చాము. ఈ ఘటనలో పిలిభిత్ పోలీసులకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గాయపడిన అనుమానితులు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వారి నుంచి 2 ఏకే-47లు, 2 ఏకే రైఫిళ్లు, 2 విదేశీ తయారీ గ్లాక్ పిస్టల్స్, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. నిందితులకు విదేశీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.