ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీడీపీ , వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా టీడీపీ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు గతంలో ఉచిత బస్సు ప్రయాణంపై ఇచ్చిన హామీ గురించి పోస్ట్ చేయగా, వైసీపీ దీనికి కౌంటరిచ్చింది. చంద్రబాబు గతంలో జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారని టీడీపీ పేర్కొనగా, వైసీపీ మాత్రం ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాలను విస్మరించరాదని గుర్తుచేసింది.
టిడిపి-జనసేన మేనిఫెస్టో
వైసీపీ సోషల్ మీడియా టీమ్ ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన ప్రసంగాల వీడియోలు, జనసేనతో కలిసి ప్రచారం చేసిన యాడ్స్, టిడిపి-జనసేన మేనిఫెస్టోలో ఉన్న హామీలను పంచుతూ మండిపడింది. “ఎన్నికల ముందు ‘రయ్ రయ్’ అని మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ‘నై నై’ అని వెనుకడుగు వేయడం ఎలా?” అంటూ వైసీపీ ప్రశ్నించింది.
RTC బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్లండి.. టికెట్ డబ్బు అడిగితే నా పేరు చెప్పండి
“RTC బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్లండి.. టికెట్ డబ్బు అడిగితే నా పేరు చెప్పండి” అని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల గురించి వైసీపీ తాజాగా విమర్శలు గుప్పిస్తోంది. ప్రజలకు ఎన్నికల ముందు చెప్పిన మాటలు గాలిలో కలిపేసి, ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడం లేదని ఆరోపించింది.

ఫ్రీ బస్సు ఫై వైసీపీ డిమాండ్
ఈ వాగ్వాదం మరింత రగిలే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సిందేనని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు, టీడీపీ తమ ప్రభుత్వం సరైన విధానాన్ని రూపొందిస్తున్నదని, వైసీపీ కావాలనే బాహ్య ప్రచారం చేస్తోందని విమర్శిస్తోంది. ఈ అంశంపై ఇంకా రాజకీయ వేడి పెరిగే అవకాశం ఉంది.