pastor praveen : పాస్టర్ పగడాల ప్రవీణ్కుమార్ ఈనెల 24న అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వద్ద ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్టు గుర్తించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పాస్టర్ బంధువులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఐజీ వెల్లడించారు.

అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం
కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డేటా పరిశీలిస్తామని ఎస్పీ డి.నరసింహకిశోర్ తెలిపారు. అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం. రాజమహేంద్రవరం ఎందుకు వచ్చారో పరిశీలించాం. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట ప్రవీణ్ కొంత స్థలం కొనుగోలు చేసినట్లు తెలిసింది. అక్కడ ఒక భవనం నిర్మించాలనుకున్నారు. దీని కోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆయన రాజమహేంద్రవరం వస్తున్నట్టు భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్కు మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులందరినీ విచారించాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తాం అని ఎస్పీ తెలిపారు.