ఫోన్ హ్యాకింగ్ బాధ తట్టుకోలేక ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉట్ల దత్తాత్రేయ కులవృత్తి మంగలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఉట్ల భువనేశ్వరి (35) కు స్మార్ట్ ఫోన్ ఉంది. అయితే ఆమె స్మార్ట్ ఫోన్ గత కొన్ని సంవత్సరాల క్రితం హ్యాకింగ్ చేయబడింది. హ్యాకర్లు ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులు సాగించారు.
హ్యాకర్ల బ్లాక్ మెయిల్
హ్యాకర్లు ఆమె చిత్రాలను మార్పింగ్ చేసి ఆమె ఫోన్కు పంపించి డబ్బులు డిమాండ్ చేశారు. భువనేశ్వరి భర్త దత్తాత్రేయ ఇరుగు పొరుగు వద్ద డబ్బులు అప్పుగా తెచ్చి హ్యాకర్లకు సమర్పించినప్పటికీ, వారు తగ్గలేదు. మరింత డబ్బు ఇవ్వాలని బెదిరింపులు చేశారు.
గ్రామస్థులకు షాక్
హ్యాకర్లు తెగింపు చర్యలు తీసుకుని భువనేశ్వరి మార్ఫింగ్ చేసిన ఫోటోలను కొంతమంది గ్రామస్థులకు పంపించడంతో, ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. గ్రామస్థుల సూచనతో పాపన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, హ్యాకర్ల బెదిరింపులు తగ్గలేదు.
ఒత్తిడికి గురైన బాధితురాలు
ఒత్తిడి కారణంగా భువనేశ్వరి అనారోగ్యానికి గురయ్యింది. గత ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతూ, శుక్రవారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం గమనించిన స్థానికులు భర్త దత్తాత్రేయకు సమాచారం అందించడంతో, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.