ప్రసూతి మరణాల రేటు తగ్గింపు పై ప్రగతి
అమరావతి, మార్చ్ 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ద్వారా ఏపీలో ప్రసూతి మరణాల రేటు తగ్గించటంలో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన ట్వీట్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
సురక్షితమైన మాతృత్వం లక్ష్యం
ప్రసూతి మరణాల రేటు తగ్గించడంతో పాటు మహిళలకు సురక్షితమైన మాతృత్వం మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
2014-20 మధ్య గణనీయమైన మార్పు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా 2014-16 మధ్య లక్ష శిశు జననాలకు 130గా ఉన్న ప్రసూతి మరణాల రేటు 2018-20 నాటికి 97కి తగ్గిందన్నారు. 2030 నాటికి మరణాల రేటు లక్షకు 70 కన్నా తక్కువగా చేయాలన్న లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ తదితర ఎనిమిది రాష్ట్రాలు సాధించాయని తెలిపారు.
ప్రసూతి సేవల పెరుగుదల
సంస్థాగత ప్రసవాలు 2015-16లో 79% ఉండగా, 2019-21 నాటికి 89%కి పెరిగాయని, మొదటి త్రైమాసికంలో గర్భస్థ శిశు సంరక్షణ కేంద్రాలను ఆశ్రయించే వారి శాతం 59 నుంచి 70కి పెరిగిందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావం
జననీ సురక్ష యోజన (JSY), ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY), జననీ శిశు సురక్షా కార్యక్రమం (JSSK), సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్ (SUMAN), ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMSMA) వంటి పథకాల ద్వారా ప్రసూతి మరణాల రేటు తగ్గుతుందని చెప్పారు.
ఆధునిక ప్రసూతి సంరక్షణ
లక్ష్య (LaQshya) లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్(OT) సంరక్షణ వంటి కార్యక్రమాలు ప్రసూతి సౌకర్యాల నాణ్యతను మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. అదనంగా, అధిక-ప్రమాదక గర్భాల కోసం ప్రసూతి ICUలు, HDUలు, MCH విభాగాలు, FRUలు బలోపేతం చేశారని వివరించారు.
వివిధ రాష్ట్రాల్లో వినూత్న చర్యలు
మధ్యప్రదేశ్లో దస్తక్ అభియాన్, తమిళనాడులో అత్యవసర ప్రసూతి సంరక్షణ వంటి కార్యక్రమాలు అమలులో ఉన్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో 2030 నాటికి మరణాలరేటు 70 కన్నా తక్కువగా చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.