హైదరాబాద్: తెలంగాణను కరువు కాటకాల పాలు చేసి 60 ఏండ్లు ఘోర కలిని సృష్టించింది కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడిగం చేసిన రేవంత్ ఇప్పుడు బాబును నొప్పించకుండా కృష్ణాజిల్లాల గురించి మాట్లాడాలనుకుంటున్నాడు అని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బిఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్ అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం. ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు అడ్డుకోవడానికి కేసుల మీద కేసులు వేసి ఆలస్యమయ్యేటట్టు చేసింది మీ కాంగ్రెస్ నాయకులు కాదా.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతిక పరమైన విషయాలు నిర్లక్ష్యం చేసి ఆదరబాదరగా ఎస్ఎల్బీసీ పనులు పరిగెత్తించారు.

దోషులు ఎవరో తేల్చు..
కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా వారిని మృత్యు కుహరంలోకి నెట్టారు. వారి ప్రాణాలు బలితీసుకొని ఇప్పుడు కుహనా ఏడ్పులు ఏడుస్తున్నారు. నీకు నిజాయితీ ఉంటే SLBC ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు! దోషులు ఎవరో తేల్చు. పచ్చి అబద్ధాలు, పిచ్చి సెంటిమెంట్లు నోటికి వచ్చినట్టు కారు పూతలు బంద్ చెయ్. ఒర్రితే పనులు కావు ఒళ్ళు వంచి పని చేస్తే పనులవుతాయి. 15 నెలలు అయినా నీకు జ్ఞానోదయం కాకపోవడం తెలంగాణ దౌర్భాగ్యం.
ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లకుండా ఎమ్మెల్సీ ఓట్ల కోసం
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ కూతురు పెండ్లికి దుబాయ్ వెళ్లిన తనపై విలసాలు, విందులకోసం వెళ్లానని అభాండాలు వేయడం ఆయన నీచత్వానికి పరాకాష్ట అని నిప్పులు చెరిగారు. ‘రేవంత్రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రమాదస్థలానికి వెళ్లకుండా ఓట్లకోసం హెలికాప్టర్లో ప్రచారానికి పోయింది వాస్తవం కాదా? హెలికాప్టర్ లేదనే కారణంతో నీటిపారుదల శాఖ మంత్రి ఘటనా స్థలానికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నది నిజం కాదా?’ అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా ప్రశ్నాస్ర్తాలు సంధించారు.