CM: హైదరాబాద్: తెలంగాణ చరిత్రలో జరిగిన పోరాటాలన్నీ భూమి కోసం జరిగాయని, కొమురంభీమ్, చాకలి అయిలమ్మ, రావి నారాయణరెడ్డి వంటి నాయకులు భూమి కోసం పోరాడారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూదాన్ ఉద్యమానికి కూడా తెలంగాణ (Telangana)నేలే పునాది అని గుర్తు చేశారు. వెదిరె రామచంద్రా రెడ్డి వేల ఎకరాలను పేదలకు పంచిన ఉదాహరణను ప్రస్తావించారు. ఆనాడు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వ్యవసాయ సీలింగ్ యాక్ట్ ద్వారా అసైన్డ్ భూములను పేదలకు పంచారని తెలిపారు. భూమిని చెరబట్టిన వారిని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ తరిమేశారని గుర్తు చేశారు. హైటెక్స్లో జరిగిన గ్రామ పంచాయతీ అధికారుల నియామక పత్రాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీసీఎల్ లోకేష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొన్నారు.

ధరణి వ్యవస్థపై విమర్శలు – భూ భారతి చట్టం ప్రవేశం
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తర్వాత ధరణి భూతాన్ని తెచ్చి ప్రజల భూదాహం తీర్చుకున్నారని, దోపిడీని కప్పిపుచ్చేందుకే వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారని ఆరోపించారు. రైతులపై నిందలు వేసి, ఉద్యోగులను చెడుగా చూపించారని మండిపడ్డారు. ధరణిని బంగాళాఖాతంలో వేసేయాలని రాహుల్ గాంధీతో చెప్పించామని, సమస్య పరిష్కారానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, భూభారతి-2025 చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఈ చట్టం ద్వారా 1.56 కోట్ల ఎకరాల భూముల రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని చెప్పారు. తహసీల్దార్లు తప్పులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సొంతింటిని తగులబెట్టుకోవడం సరైంది కాదని అన్నారు. భూభారతి చట్టం ద్వారా పేద రైతులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంపై ఆరోపణలు
గత ప్రభుత్వం 2020 ఆర్వోఆర్ చట్టం, ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ సమాజానికి నష్టం కలిగించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణిని రద్దు చేసి, భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటికే 8.65 లక్షల దరఖాస్తులు వచ్చాయని, కోర్టు స్టే తొలగించేందుకు సఫలమైనట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6860 క్లస్టర్లను ఏర్పాటు చేసి, 10,954 గ్రామాలలో గ్రామపాలనాధికారులను నియమిస్తున్నామని చెప్పారు. అదనంగా సర్వేయర్ల నియామకం చేపడుతున్నామని వివరించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ధరణి స్థానంలో భూభారతి చట్టం(Land Act) అద్భుత ఫలితాలు ఇస్తుందని, దీనిని రూపొందించే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడిపారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ పోరాటాల ప్రధాన కారణం ఏమిటి?
తెలంగాణ చరిత్రలో పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
భూదానోద్యమానికి పునాది ఎక్కడ పడింది?
తెలంగాణలోనే భూదానోద్యమానికి పునాది పడిందని, వెదిరె రామచంద్రా రెడ్డి వేల ఎకరాలను దానం చేశారని గుర్తు చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Read also: