CM: ఏళ్ల తరబడి గుడిసెల్లో నివసించిన గిరిజన కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నిండబోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని మారుమూల గ్రామం బెండాలపాడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి(Indiramma Housing Scheme) వేదిక కానుంది. ఈ పథకంలో నిర్మించిన ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:20 గంటలకు హెలికాప్టర్లో బెండాలపాడుకు చేరుకుంటారు. గ్రామంలోని లబ్ధిదారులు బచ్చల నర్సమ్మ, బచ్చల రమణ ఇళ్లలో జరిగే గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఇతర లబ్ధిదారులతో మాట్లాడి, గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం, దామరచర్లలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.

బెండాలపాడు – పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్గా బెండాలపాడు గ్రామంలో ప్రారంభించింది. చండ్రుగొండ మండలానికి 968 ఇళ్లు మంజూరు కాగా, ఒక్క బెండాలపాడుకు 310 ఇళ్లు కేటాయించబడ్డాయి. వీటిలో 58 ఇళ్ల స్లాబులు పూర్తయ్యాయి, 86 ఇళ్లు పైకప్పు దశలో, 150 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఇళ్లు నిర్మాణం పూర్తిచేసిన గ్రామంగా బెండాలపాడు ఒక మైలురాయిగా నిలిచింది.
చారిత్రక ఘట్టం: మంత్రి పొంగులేటి
ఈ పర్యటన ఏర్పాట్లను మంగళవారం సమీక్షించిన రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) మాట్లాడుతూ –
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మారుమూల గిరిజన గ్రామానికి రావడం చారిత్రక ఘట్టం. ఇది ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లబ్ధిదారుల ఎంపిక నుంచి నిధుల విడుదల వరకు పూర్తి పారదర్శకత పాటిస్తున్నాం. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.
మహబూబ్నగర్లో సీఎం పర్యటన
భద్రాద్రి పర్యటనకు ముందు ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ మూసాపేట మండలంలోని కార్నింగ్ టెక్నాలజీస్ యూనిట్ను ప్రారంభించి, పార్టీ ప్రధాన కార్యకర్తలతో సమావేశమవుతారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరి, ఆ కార్యక్రమం ముగించుకుని భద్రాద్రి పర్యటనకు చేరుకుంటారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద బెండాలపాడులో ఎంత ఇళ్లు నిర్మిస్తున్నారు?
మొత్తం 310 ఇళ్లు నిర్మిస్తున్నారు.
గృహప్రవేశం ఎప్పుడు, ఎవరితో జరగనుంది?
బుధవారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: