తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు ఆలస్యంగా వచ్చే లేదా డుమ్మా కొట్టే ఉపాధ్యాయులకు చెక్ పెట్టేందుకు నడుం బిగించింది. పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని (FRS) ఆగస్టు 1 నుండి అమలులోకి తీసుకురానుంది. దీని అమలుకు సంబంధించి ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆగస్టు 1 నుండి ఇది ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రారంభమై, వారం రోజుల వ్యవధిలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అమలు కానుంది. ఈ కొత్త విధానం ద్వారా ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పాఠశాల ప్రాంగణం నుంచే తమ హాజరు వివరాలను జియో కోఆర్డినేట్ అటెండెన్స్ ద్వారా లాగిన్, లాగౌట్ చేసుకుని నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల తరచుగా పాఠశాలలకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒకే విధానం
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా FRS హాజరు ప్రక్రియ అమలవుతోంది. దీనివల్ల ఆ రోజు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు, ఏ సమయంలో హాజరు తీశారు అనే వివరాలు నేరుగా ప్రభుత్వానికి చేరతాయి. ఇది మధ్యాహ్న భోజనం నిర్వహణలో పారదర్శకతకు కూడా దోహదపడుతుంది. ఇప్పుడు ఇదే యాప్లో “స్టాఫ్” అనే విభాగాన్ని జోడించి, కొద్దిరోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం, ఆగస్టు 1 నుంచి ఉపాధ్యాయులకు కూడా FRS విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విధానం ప్రకారం, ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చినప్పుడు మరియు తిరిగి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ముఖం ఆధారంగా హాజరు నమోదు చేయాలి. దీని ద్వారా ఉపాధ్యాయుల హాజరు మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
పారదర్శకత దిశగా ముందడుగు
తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల హాజరు పట్ల పకడ్బందీ చర్యలు తీసుకోవడం ద్వారా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు. ఆలస్యంగా రావడం లేదా సెలవులు లేకుండా డుమ్మా కొట్టడం వంటి కార్యకలాపాలను అరికట్టడానికి ఈ FRS విధానం సమర్థవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన నాణ్యతను పెంచడానికి ఒక కీలకమైన అడుగుగా చెప్పవచ్చు. మరిన్ని వివరాల కోసం వేచి చూద్దాం.
Read Also : ACB : తెలంగాణ లో దూకుడు పెంచిన ఏసీబీ