హైదరాబాద్ : రాష్ట్రంలోని చేనేత కార్మికులకు రుణమాఫీని అమలు చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సెపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth Reddy) సోమవారం లేఖ రాశారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన నేతన్నల రుణమాఫీ అమలు కాక బ్యాంకుల్లో అసలు, వడ్డీలు పేరుకుపోతున్నాయని.. దానికి తోడు ప్రయివేటు అప్పుల భారం పెరిగి చేనేత కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయని సీఎంకి రాసిన లేఖలో జాన్వెస్లీ పేర్కొన్నారు.

Read Also: Satya Kumar: గిరిజనులు సంస్కృతికి వారసులు
ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే నేతన్నలకు రుణమాఫీని అమలు చేయాలని, వారి ఇతర సమస్యలను కూడా పరిష్కరించి ఆదుకోవాలని సీఎంని లేఖలో కోరారు. చేనేత కార్మికులకు రూ. లక్ష లోపు రుణమాఫీ చేస్తామని 2024 సెప్టెంబర్ 9న సీఎంగా ప్రకటించి, జీవో 56ను జారీ చేశారని, 2025-26 బడ్జెట్ నుంచి రు.33 కోట్లు మంజూరు కూడా చేశారని గుర్తు చేశారు. రూ. లక్షలోపు రుణమాఫీ చేస్తామని, లక్షకు పైగా రుణం ఉన్న వారు ఆపై మొత్తాన్ని జూలైలోగా చెల్లిస్తేనే వారికి రుణమాఫీ అవుతుందని అధికారులు చెప్పడంతో, చాలామంది అప్పు తెచ్చి రుణం చెల్లించారు.

కానీ నేటికీ రుణమాఫీ జరగలేదని.. తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరగడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీ కోసం రు.48 కోట్లు వెంటనే విడుదల చేయాలని, సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేసి పెట్టుబడి సాయం క్రింద రాయితీతో జీరో వడ్డీతో రు.5 లక్షల కొత్త రుణం ఇవ్వాలన్నారు. చేనేత భరోసా పథకంలో జీయోటాగ్ ఉన్న చేనేత కార్మికుడికి నెలకు రు.2వేలు, అనుబంధ కార్మికులకు ఇద్దరికి కలిపి రు.1000లు అమలు చేయాలని, జియోటాగ్ ప్రక్రియను నిరంతరంగా చేయాలన్నారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, టెస్కోకు పాల కవర్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు. త్రిఫ్ట్ పథకం ద్వారా మరణించిన నేతన్నలకు బీమా అమలు చేయాలని, రు.5లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. నూలు, రంగులు, రసాయనాలపై, చేనేత చీరలపై జీరో జీఎస్టి చేయాలని సిఎంకి రాసిన లేఖలో జాన్వెస్లీ కోరారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: