అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం: నీటిపాలైన పంటలు, కన్నీళ్లు తుడుచుకున్న అన్నదాతలు
Telangana : రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు కార్చేశాయి. ఖమ్మం, వరంగల్, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాల ప్రభావంతో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. రాత్రిపూట వర్షాలు కురవడంతో పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి, మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన పంటలపై అడుగుమేర నీరు నిలిచిపోయింది. రైతులు ఆ నీటిని బకెట్లతో తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోయింది. కొణిజర్ల, ఏదులాపురం ప్రాంతాల్లో మొక్కజొన్న, మిర్చి వంటి పంటలు నాశనమయ్యాయి. కొంతమంది రైతులు రాత్రివేళ వర్షం రావడంతో తమ పంటలను కాపాడుకోలేకపోయారు. పొలాల్లో మిగిలిన పంటలు కూడా తడవడం వల్ల చేతికి రావాల్సిన దిగుబడి నీటిపాలైంది.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో సుమారు 1500 ఎకరాల్లో వరి పంట నేలవాలిపోయింది. వడ్లు నేలరాలిపోయి నష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండే దశలో ఉన్న మామిడికాయలు అకాల వర్షాల వల్ల నేలరాలిపోయాయి. ఈదురుగాలులు మామిడితోటలలోని కాయలన్నింటినీ నేలకింద పడేసాయి.

వైరా, కూసుమంచి వంటి ప్రాంతాల్లో తడిసిపోయిన మిర్చి బస్తాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఖమ్మం మార్కెట్ యార్డ్లో భారీగా మామిడికాయలు నేలరాలగా, అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో 3.4 సెం.మీ వరకు వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఈ పరిస్థితులు వ్యవసాయానికి ఎంతగానో బలహీనత తీసుకువచ్చినట్టు స్పష్టం అవుతోంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం అందించాలని, పంట నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇలా అకాల వర్షాల వల్ల నష్టపోతున్న తమను ఆదుకోవాలని రైతుల వేడుకోలు కొనసాగుతోంది.
Read More :Congress Party : నిరసన – సోనియా, రాహుల్ పై ఈడీ ఛార్జీషీట్